
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోనుంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతి చెందారు. విశ్వాస్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రం ప్రమాదం నుంచి బయపడ్డారు. అయితే తల్లి మాట కారణంగా యమన్ వ్యాస్, సరైన పత్రాలు లేక జామిని, ప్రియా పటేల్, ట్రాఫిక్లో చిక్కుకుపోయి భూమి చౌహాన్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ప్రమాదం జరిగిన జూన్ 12న గుజరాత్కు చెందిన యమన్ వ్యాస్ అదే విమానంలో ఎక్కేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కుమారునికి వీడ్కోలు పలికే సమయంలో వ్యాస్ తల్లి భావోద్వేగానికి లోనయ్యింది. ‘కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు కదా’ అని అడిగింది. అంతే తల్లి ప్రేమకు తలొగ్గిన వ్యాస్ వెంటనే తన విమాన టికెట్ను రద్దు చేసుకున్నాడు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకెన్లకే నేల కూలింది. విమాన ప్రమాదం వార్త వినగానే యమన్ దిగ్బ్రాంతికి లోనయ్యారు. తన తల్లే తనను కాపాడిందని ఆయన మీడియాకు తెలిపారు.
యమన్ వ్యాస్ కొన్నేళ్లుగా యూకేలో పనిచేస్తున్నారు. రెండేళ్ల తర్వాత వడోదర వచ్చారు. తన కుటుంబంతో కొన్ని రోజులు ఉన్నాక, తిరిగి లండన్కు బయలుదేరారు. అయితే అతని తల్లి పట్టుబట్టడంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అహ్మదాబాద్లోని చంద్లోడియాకు చెందిన జామిని, ప్రియా పటేల్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు తమ స్నేహితుని ఆహ్వానం మేరకు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరు విజిటర్ వీసాపై ప్రయాణానికి బయలుదేరారు. అయితే వీరి దగ్గర కొన్ని పత్రాలు లేని కారణంగా, విమానం ఎక్కేందుకు అనుమతి లభించలేదు. దీంతో నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విమాన ప్రమాదం గురించి వారికి తెలిసింది. ఇదేవిధంగా భారత్కు వచ్చిన బ్రిటన్ నివాసి భూమి చౌహాన్ అహ్మదాబాద్లో భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దీంతో ఆమె విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో ఆమె విమానం ఎక్కలేకపోయారు.
ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం