టెహ్రాన్: వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో బదులిచ్చింది. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఖతమ్ అల్ అన్బియా ప్రకటించింది. ఇరాన్ను అణిచివేసి.. రాతి యుగం నాటికి పంపుతానన్న ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్లను ఇరాన్ హెచ్చరించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.
ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న అమెరికా వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక శక్తిపై అమెరికా వద్ద ఉన్న సమాచారం అసంపూర్ణంగా పేర్కొంది. టెహ్రాన్ క్షిపణి, డ్రోన్ దాడి సామర్థ్యాలను భారీగా తగ్గించామన్న ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తూ.. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి వాషింగ్టన్కు ఏమీ తెలియదంటూ ఖాతమ్ అల్-అన్బియా ప్రతినిధి పేర్కొన్నారు.
"మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు, సుదూర శ్రేణి దాడి డ్రోన్లు, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను నాశనం చేశామని అనుకోవద్దు. అటువంటి అంచనాలు మీరు చిక్కుకున్న ఊబిని మరింత లోతుగా చేస్తాయి. మీరు దెబ్బతీశామని భావిస్తున్న ప్రాంతాలు చాలా స్వల్పమైనవి. మా వ్యూహాత్మక సైనిక ఉత్పత్తి మీకు తెలియని.. మీరు చేరుకోలేని రహస్య ప్రాంతాల్లో జరుగుతోంది’’ అని ఇరాన్ పేర్కొంది. అమెరికా దురాక్రమణకు దిగిందని ఆరోపిస్తూ.. ప్రతీకార చర్యలు కొనసాగుతాయి. ఈ యుద్ధం అమెరికా లొంగిపోయే వరకు ఆగిపోదు.. భవిష్యత్తులో మరిన్ని వినాశకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తమ్ అల్-అన్బియా ప్రతినిధి హెచ్చరించారు.


