
డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఏది చేసినా తమ పాటే వినాలనే పంతం. ఏ అంశాన్ని తీసుకున్నా ‘వామ్మో ట్రంప్’ అనుకోవాల్సిన పరిస్థితి. అటు సుంకాలు పెంపు దగ్గర్నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం, పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం.. ఇలా ప్రతీది ట్రంప్కు ముడిపడే ఉంది.
ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకున్నారు. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్నది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్రరాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.
మరి ఇరాన్పై కక్ష ఎందుకు?
ఇక్కడ ఇరాన్పై మాత్రం ట్రంప్ పగ కనబడుతూనే ఉంది. తాజాగా ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్ సమర్ధిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్ ేచేసిన దాడి అద్భుతమని కొనియాడారు. అదే సమయంలో ఇంకా ఇరాన్పై దాడిని ఇజ్రాయిల్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి చెప్పారు. మొన్నటి వరకూ రష్యా- ఉక్రెయిన్ల సుదీర్ఘ యుద్ధం, ఆపై భారత్-పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం.. ప్రపంచానికి పెనుముప్పు అని కనువిప్పు కల్గించిన ట్రంప్.. ఇప్పుడు ఇజ్రాయిల్-ఇరాన్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ట్రంప్కు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇలా వ్యవహరిస్తారనేది తాజా ప్రకటనతో తేటతెల్లమైంది.
అణు ఒప్పందంపై ఇరాన్కు చాన్స్ ఇచ్చామని, కానీ దాన్ని వారు పట్టించుకోలేదన్నారు ట్రంప్. తమతో అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి నిరాకరించారని, అందుకు తగిన ప్రతిఫలమే ఇజ్రాయిల్ చేసిన దాడి అంటూ ఏబీసీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. వారు(ఇరాన్) ఇంకా మూల్యం చెల్లించుకుంటుందంటూ ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని నేరుగా అభినందిస్తూ ఇరు దేశాలను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాము చెప్పిన మాట విననందుకు ఇరాన్ ఏమైపోయినా ఫర్వాలేదన్న వైఖరి ట్రంప్లో స్పష్టంగా కనబడుతోంది.
ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్ ఉన్నారనేది తాజా పరిణామాలతో రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.