
45 మంది మృతి
మరో 49 మంది గల్లంతు.. 109 మందికి గాయాలు
నైరోబీ(కెన్యా): ఆఫ్రికా దేశం కెన్యాలో జలాశయం ధ్వంసమై నివాసప్రాంతాలను ముంచెత్తడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది గల్లంతయ్యారు. సుమారు 109 మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. తరచూ ఆకస్మిక వరదలు సంభవించే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
మయి మహియులో ఇటీవలి వర్షాలకు పొంగి పొర్లుతున్న పాత కిజాబె డ్యాం ఆనకట్ట కొట్టుకుపోయింది. దీంతో వరద ఒక్కసారిగా నివాస ప్రాంతాలను ముంచెత్తిందని, ప్రధాన రహదారి కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో వరద పోటెత్తడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు.