కస్టమ్స్
విభాగం..
ఖిలా వరంగల్: కస్టమ్స్ విభాగం కేవలం పన్నులు వసూలు చేసే సంస్థ స్థాయి నుంచి ప్రపంచ వాణిజ్యానికి సౌకర్యకర్తగా మారిందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అదనపు కమిషనర్ పి. సతీశ్(ఐఆర్ఎస్) పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ బస్టాండ్ రోడ్డులోని ఎం.కె. నాయుడు హోటల్ అండ్ కన్వెన్షన్ హాల్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో ఎగుమతులపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం దాదాపు 90శాతం దిగుమతి సరుకులను ఎలాంటి జోక్యం లేకుండా సజావుగా క్లియర్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఫిక్కీ సీనియర్ కన్సల్టెంట్ పి.ఎస్ పృథ్వీ మాట్లాడుతూ ఏటీఏ కార్నెట్ అంతర్జాతీయ ప్రదర్శనలు, వాణిజ్య కార్యక్రమాలకు తీసుకెళ్లే వస్తువులకు పాస్పోర్ట్గా పనిచేస్తుందని వివరించారు. ఫిక్కీ డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి మాట్లాడుతూ ఏటీఏ కార్నెట్, టీఐఆర్ వ్యవస్థలకు సంబంధించి పత్రాలు, హామీల జారీ విషయంలో ఫిక్కీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వరంగల్ చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ నుంచి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. ప్రధానంగా మిర్చి, మామిడి వంటి ఉత్పత్తులకు ఆగ్నేయాసియా మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. చాంబర్ కార్యదర్శి ఎం.వేద ప్రకాశ్, వ్యాపారులు, ఎగుమతిదారులు పాల్గొన్నారు.
ఆ డిపార్ట్మెంట్ హైదరాబాద్
అదనపు కమిషనర్ సతీశ్


