డీఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రదీప్
వరంగల్ లీగల్: వృద్ధులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడపాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రదీప్ సూచించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదనం బిల్డింగ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో న్యాయమూర్తి ప్రదీప్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలతో బాధపడుతున్న వయోవృద్ధులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయవాది సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా వృద్ధులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న వారిని అభినందించి, సత్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి పీఎస్.ఫణికుమార్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు కోన్ మల్లారెడ్డి, లా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బి.విజయలక్ష్మి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.శ్రీనివాసరావు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వృద్ధులు పాల్గొన్నారు.


