ఖిలా వరంగల్ : పోస్టల్ సర్వీస్లపై ఫిర్యాదులకు ఈనెల 22న 55వ ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్ను గూగుల్ మీట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు వరంగల్ సూపరింటెండెంట్ రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్ డివిజన్కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులకు ఏమైనా ఫిర్యాదులుంటే పోస్టల్ ఎన్వలప్ / కవర్పై 55వ డాక్ అదాలత్ రాయాలని, కె.శ్రీకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాప్ అండ్ విజిలెన్స్, పోస్టుమాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్కు ఈనెల 31వ తేదీ లోగా పంపించాలని ఆయన కోరారు.
పర్యావరణ పరిరక్షణ
అందరి బాధ్యత
హన్మకొండ కల్చరల్: పర్యావణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ అన్నారు. గురువారం వరంగల్ హంటర్ రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో వనమహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గడ్డం భాస్కర్, ప్రముఖ పర్యావరణవేల్ల తాళ్లపల్లి రామస్వామి గౌడ్ పాల్గొని పీఠానికి పలురకాల పండ్లు, పూల మొక్కలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్ధులకు విద్యతోపాటు పర్యావరణంపై అవగాహన కల్పించాలని, మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించినట్లేనని పేర్కొన్నారు. అనంతరం పీఠం ప్రాంగణంలో విద్యార్థులు, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఆమేర్ అలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, డాక్టర్ బాసాని సురేశ్, టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ గంపా సతీశ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
చోరీ కేసులో ముగ్గురు దొంగల అరెస్ట్
గీసుకొండ : పెట్రోల్ బంకులో చోరీకి పాల్ప డిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. కాజీపేట అంబేడ్కర్నగర్కు చెందిన కంది చరణ్, గండికోట శివ, జక్కుల ప్రతాప్ ఈనెల 18న అర్ధరాత్రి ఊకల్ హవేలి శివారులోని వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న మేనేజర్ కౌడగాని రాజగోపాల్ను సీఎన్జీ పంపు ఎక్కడ ఉందని అడిగినట్లు నటించారు. రెక్కీ నిర్వహించి దొంగతనం చేయడానికి పథకం రచించినట్లు సీఐ తెలిపారు. అనంతరం రాజగోపాల్ రెండో పంపు అవరణలో నిద్రిస్తుండగా అతడి బ్యాగులోని రూ.15800 నగదును దొంగిలించి ఆటోలో పారిపోయినట్లు తెలిపారు. పెట్రోల్ పంపు యజమాని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. గురువారం మరియపురం శివారు కెనాల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల నుంచి రూ.11 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నాని చెప్పారు. నిందితులపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఎస్సై అనిల్ కుమార్, కానిస్టేబుళ్లు అరవింద్, విజయ్, ప్రవీణ్, సాయిలను ఇన్స్పెక్టర్ అభినందించారు.


