
విద్యతోనే సమాజంలో గౌరవం
వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని, విద్యతోనే సమాజంలో గౌరవ, మర్యాదలు ఉంటాయని కలెక్టర్ సత్యశారద సూచించారు. బుధవారం ఖిలావరంగల్ మండల పరిధిలోని కరీమాబాద్, మధ్యకోట బాలికల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను డీఈఓతో కలిసి కలెక్టర్ సందర్శించారు. కరీమాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి చదువు సామర్థ్యాలు, పాఠశాల్లో రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, మరుపల్లి రవి, ఎంఈఓ ప్రసాద్, హెచ్ఎం మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలకార్మికులను గుర్తించి బడికి పంపాలి
న్యూశాయంపేట: ఇటుక బట్టీలు, బీడీ, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలను తనిఖీ చేసి బాలకార్మికులను గుర్తించి బడికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ నారాయణస్వామి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి
ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 21, 24 తేదీల్లో వరంగల్ ఓసిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా యోగా, జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.