
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ఎంజీఎం : సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో హనుమకొండ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కడిపికొండ పీహెచ్సీకి చెందిన డాక్టర్లు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా 15 రోజులపాటు పిల్లలు అతిసార వ్యాధి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, జింక్ ట్యాబెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో తప్పకుండా డ్రై డే పాటించేలా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. టీబీ చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని, వారి పోషణకు సంబంధించిన అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్, అదనపు డీఎంహెచ్ఓ, ఇన్చార్జ్ మలేరియా అధికారి డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారి ఇక్తాదర్ అహ్మద్, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమ రక్ష ప్రోగ్రాం అధికారి మంజుల, వైద్యాధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య