
మారని ‘తూర్పు’ పోలీసుల తీరు
మరోసారి వివాదంలో వరంగల్ ఖాకీలు
సాక్షి, వరంగల్ : వరంగల్ డివిజన్ పోలీసుల తీరు మారడం లేదు.. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తమ స్టేషన్ పరిధితోపాటు హద్దులు దాటి మరీ వరంగల్ తూర్పులోని ముఖ్య నేతకు బందోబస్తుగా వెళ్లడం దుమారం రేపుతోంది. గతంలో స్టేషన్ ఘన్పూర్లోని ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఎస్కార్ట్గా వ్యవహరించిన మిల్స్ కాలనీ సీఐ మల్లయ్యను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే ఇటీవల వరంగల్ తూర్పులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొండా మురళికి పోలీసుస్టేషన్లో తమ విధులు వదిలి బందోబస్తుగా వెళ్లిన వరంగల్ డివిజన్లోని ఏసీపీ, సీఐ, ఎస్సైల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని సీరియస్గా తీసుకున్న వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ వివరణ ఇవ్వాలంటూ మూడు రోజులక్రితం మెమో జారీచేయడం ఖాకీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ఆయా పోలీసు అధికారులు సీపీకి వివరణ ఇచ్చారు. వారిచ్చిన వివరణ ఆధారంగానే తదుపరి చర్యలుంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఏసీపీ పాల్గొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.