
భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని చెల్లించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ఆర్ఓబీ తదితర అభివృద్ధి పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ఇన్నర్ రింగ్రోడ్డు పనులను ప్రాధాన్యతతో కొనసాగించాలన్నారు. టెక్స్టైల్ పార్కులో వరద ముంపు నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని సాంకేతికంగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి
భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించడానికి ఉపాధి శాఖ, జీఎం ఇండస్ట్రీయల్, డీఆర్డీఓ సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు వరంగల్ కలెక్టర్ సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, జోనల్ మేనేజర్ స్వామి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, గీసుకొండ, సంగెం, నెక్కొండ, పర్వతగిరి తహసీల్దార్లు, నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ పాల్గొన్నారు.