
పిట్టగూళ్లు, వరి కంకుల పంపిణీ
నయీంనగర్: మహర్షి గోశాల, ఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆదర్శ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ 53వ డివిజన్ ఆదర్శ కాలనీలో సోమవారం పిట్టగూళ్లు, వరికంకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర గొప్పదని అన్నారు. నేటి ఆధునిక సమాజం కాంక్రీట్ జంగిల్గా మారడంతో పక్షులు తమ గూళ్లు కట్టుకోడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. పిచ్చుక జాతి అంతరించిపోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ క్రమంలో వాటి సంరక్షణకు గూళ్ల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షుడు తూడి విద్యాసాగర్ రెడ్డి, నర్సింహస్వామి, రమణయ్య, మంజుల, వనజ, తేరాల యుగంధర్, యాదగిరి, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.