సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి

Jun 17 2025 4:47 AM | Updated on Jun 17 2025 4:47 AM

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి

వరంగల్‌ అర్బన్‌: ‘వ్యయ, ప్రయాసలకోర్చి క్షేత్ర స్థాయి సమస్యలపై ప్రజలు గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదులు అందజేస్తారు. అలాంటి ఫిర్యాదులపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు’ అని గ్రేటర్‌ వరంగల్‌ నూతన కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో ప్రజల నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్‌ పలు సమస్యలపై ఆరా తీస్తూ, ఆదేశాలిచ్చారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో శానిటేషన్‌ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆక్రమణలు, అతిక్రమణలు, ఇతర ఫిర్యాదులపై టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది వారం రోజుల్లో క్లియర్‌ చేయాలని కోరారు. సమస్యాత్మకంగా ఉంటే తన దృష్టికి తీసుకొచ్చి, నివేదిక రూపంలో అందజేయాలని సూచించారు. సీడీఎంఏ సిటిజన్‌ బుడ్డీ యాప్‌లోని విజ్ఞప్తులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారని, ఇక్కడ కూడా ఆ విధానాన్ని వేగంగా పాటించాలన్నారు.

మొత్తం 111 ఫిర్యాదులు

బల్దియా గ్రీవెన్స్‌ సెల్‌కు మొత్తం 111 ఫిర్యాదులు వచ్చాయి. అందులో టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌కు 58, ఇంజనీరింగ్‌ విభాగానికి 26, హెల్త్‌, శానిటేషన్‌కు 9, పన్నుల సెక్షన్‌కు 9, తాగునీటి సెక్షన్‌కు 5, హార్టికల్చర్‌ 2, ఎలక్ట్రికల్‌ విభాగానికి 2 ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ జోనా, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, సెక్రటరీ అలివేలు, ఇన్‌చార్జ్‌ సిటీప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, హెచ్‌ఓలు రమేశ్‌, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌, ఎంహెచ్‌ఓ రాజేశ్‌, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

– 29వ డివిజన్‌ రామన్నపేటలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సెల్‌ టవర్‌ అనుమతులు రద్దు చేసి, స్థానికుల ఆరోగ్యాలను కాపాడాలని కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.

● 41వ డివిజన్‌ శంభునిపేట అంబేడ్కర్‌ వీధిలో 3 విద్యుత్‌ స్తంభాలు మంజూరు చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● హనుమకొండ ప్రశాంత్‌నగర్‌ డాక్టర్స్‌ కాలనీలో 60 ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని పట్టదారులు అడ్డుకుంటున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● హనుమకొండ 30వ డివిజన్‌ ఏషియన్‌ మాల్‌ వెనుక భాగంలో, హయగ్రీవా చారి గ్రౌండ్‌కు సమీపంలో ఆస్పత్రి భవన నిర్మాణాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని స్థానిక కార్పొరేటర్‌ కోమల విన్నవించారు.

● హనుమకొండ ఏకశిల పార్కు ఎదుట వాహనాల పార్కింగ్‌, పార్కులు, వివిధ సమస్యలు పరిష్కారించాలని వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.

● హనుమకొండ ఎర్రగట్టు గుట్ట వద్ద అంబాల రోడ్డులో బస్‌ షెల్టర్‌ నిర్మించాలని నారాయణనగర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విన్నవించారు.

● హనుమకొండ పెగడపల్లికి వెళ్లే రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని హనుమాన్‌ నగర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

24 గంటల్లో శానిటేషన్‌ పనులు పూర్తి చేయాలి

7 రోజుల్లో టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ ఫిర్యాదులు పరిష్కారమవ్వాలి

సీడీఎంఏ సిటిజన్‌ బుడ్డీ ఫాలో కావాలి

గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో కొత్త కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement