
సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషి, సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యపడుతుందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై జిల్లా సంక్షేమ అధికారి జయంతి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ టీమ్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, షాపులు, ప్రమాదకర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. 14 సంవత్సరాల్లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత యజమానులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని, 18 సంవత్సరాల్లోపు వారైతే బాలల న్యాయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో సేకరించి నివేదికలు అందజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య స్పెషల్ డ్రైవ్కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ, అనంతరం లేబర్ అడ్డా వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏఎస్ వినీత, ఎన్సీఎల్పీ డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్, బాలల సంక్షేమ సమితి సభ్యులు కజాంపురం దామోదర్, సందసాని రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ ఎస్ భాస్కర్, ఏహెచ్టీయూ ఎస్సై ఫిలిప్ రాజ్, కానిస్టేబుల్ రాము, సోషల్ వర్కర్స్ శ్రీనివాసులు, సునీత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.