
ఎన్ఎంసీ గండం!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎంజీఎం:
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆనంతరం అప్పటి ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటికే ఉన్న కాకతీయ మెడికల్ కళాశాలకు అదనంగా జనగామ, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్లలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా.. ఓ మెడికల్ కళాశాలకు ఏర్పాటు చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉండాలి...? ఆ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల సంఖ్య ఎంత...? దానికి అనుగుణంగా ఎలాంటి పరికరాలు ఉండాలి...? అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు నియామకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయలేదు. వైద్యవిద్యార్థుల బోధనకు కావాల్సిన హాస్టల్ వసతులు? వైద్యానికి అవసరమైన పరికరాలు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేసి ఇవన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మెడికల్ కళాశాల స్థాపనకు ప్రభుత్వం ముందడుగు వేయాలి. కానీ, అలాంటి విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా అరకొర వసతులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలను నెలకొల్పి కొనసాగుతున్న క్రమంలో వసతుల కొరతను గుర్తించిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సీరియస్ అయ్యింది. కేఎంసీతోపాటు ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ప్రస్తుతం ప్రభుత్వానికి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి.
కేఎంసీలో లోపాలపై సీరియస్..
వైద్య కళాశాలల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఖాళీలు, లోపాలపై సీరియస్ అయ్యింది. ఎప్పుడో స్థాపించిన కాలేజీలోనూ నిబంధనల మేరకు వసతులు లేకపోవడం చూసి ఆశ్చర్యానికి గురైన ఎన్ఎంసీ.. నోటీసులు జారీ చేసింది. యూజీఎంఎస్ఆర్–2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరు, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు కావాల్సిన మృతదేహాలు, ఇతర పరికరాలు, డిజిటల్ రికార్డింగ్, సీసీటీవీల ఏర్పాటు వంటి వాటిపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల కల్పన, క్లినికల్ ట్రెయినింగ్ వంటి అంశాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలను కొనసాగించడమో.. రద్దు చేయడమో నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది.
నేడు తేలనున్న భవితవ్యం..
ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం నేడు (బుధవారం)తేలనుంది. గుర్తించిన లోపాలు, షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇవ్వాలని, ఇందుకోసం బుధవారం ఢిల్లీకి రావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈలను ఆదేశించింది. ఆ లోపాలను సరిచేస్తామని అన్ని కళాశాలలనుంచి హామీ పత్రాలు ఇవ్వనున్నారు. కానీ, వాటికి కూడా సంతృప్తి చెందక సీట్లు తగ్గిస్తారా? జరిమానాలు విధిస్తారా..? మందలించి వదిలేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో పూర్తి వివరాలు సమర్పించేందుకు అన్ని జిల్లాల, మెడికల్ కళాశాలల డీన్లు/ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో డీఎంఈ సోమ, మంగళవారాల్లో సమావేశమై కళాశాలల సమగ్ర సమాచారం సేకరించారు.
130కి పైగా కీలక పోస్టులు ఖాళీ
1955వ సంవత్సరంలో 50 సీట్లతో ప్రారంభమైన కాకతీయ మెడికల్ కళాశాల ప్రస్తుతం 250 ఎంబీబీఎస్, 100కుపైగా పీజీ సీట్లు, ఐదు సూపర్ స్పెషాలిటీ సీట్లతో కొనసాగుతోంది. కళాశాలలో వైద్యవిద్య బోధించేందుకు 22 విభాగాల బోధన సిబ్బందితో మరో 10 విభాగాల బోధనేతర సిబ్బంది పనిచేయాలి. మొత్తం ఈ విభాగంలో 250మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులకు బోధన చేయాలి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఉంటారు. ప్రస్తుతం కేఎంసీ అనుబంధంగా కొనసాగుతున్న ఎంజీఎం, సీకేఎం, ఆర్ఈహెచ్, జీఎంహెచ్ టీబీ ఆస్పత్రులు ఉన్నాయి. కేఎంసీలో ప్రొఫెసర్ స్థాయిలో 10కిపైగా, అసోసియేట్ స్థాయిలో 35కు పైగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో సుమారు 90కిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్యవర్గాలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న కేఎంసీ పరిస్థితి ఈ విధంగా ఉంటే రెండు, మూడేళ్ల క్రితం ఏర్పడిన నూతన కళాశాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది.

ఎన్ఎంసీ గండం!