మొక్కుబడిగా బడిబాట..! | - | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగా బడిబాట..!

Jun 18 2025 3:02 AM | Updated on Jun 18 2025 3:02 AM

మొక్కుబడిగా బడిబాట..!

మొక్కుబడిగా బడిబాట..!

విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తూ.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నా తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల నిర్వహించిన బడిబాటలో పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ఈనెల19వ తేదీతో (గురువారం) ముగియనుంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలతోపాటు వివిధ అంశాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. బడిబాటలో భాగంగా ర్యాలీలు, ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తించడం వారి పేర్లు నమోదు చేసుకోవటం వంటివి చేసి పాఠశాలల్లో చేర్పించాలనే ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రభ్వుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. బడిబాట ముగింపు దశకు వచ్చినా అనుకున్న మేర విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదనేది స్పష్టమవుతోంది. అసలు విద్యార్థులు లేని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటికి సర్దుబాటు తప్పదని భావిస్తున్నారు.

గురుకుల పాఠశాలల ప్రభావం..

హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం బడిబాట నిర్వహించినా గురుకులాల్లోనే ఎక్కువగా విద్యార్థులు చేరుతున్నారనేది స్పష్టమవుతోంది. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు కూడా అందుబాటులో ఉండటంతో అందులో చేర్పిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల వైపు వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమ రీ తరగతులు ప్రారంభించారు. హనుమకొండలో 16, వరంగల్‌లో 13 పాఠశాలల్లో ప్రారంభించి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఏ మేరకు ప్రవేశాలు పొందుతారనేది వేచి చూడాల్సిందే.

హనుమకొండ జిల్లాలో 4,131 మంది ప్రవేశాలు

హనుమకొండ జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బడిబాట కార్యక్రమం కూడా ముగియ వచ్చినా.. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో కలిపి మొత్తంగా 4,131మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో ఒకటో తరగతిలోనే 2,074మంది ప్రవేశం పొందారు. హనుమకొండ జిల్లాలో 492 ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో 41 ప్రభుత్వ పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. బడిబాట కార్యక్రమం ద్వారా కనీసం పది మంది విద్యార్థులు చేరితే ఆయా పాఠశాలలను తెరిపిస్తామని డీఈఓ అవకాశం కల్పించారు. దీంతో ఏడు పాఠశాలల్లోనే కొద్దిమంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా వాటిని తెరిచారు.

విద్యార్థుల నమోదు లక్ష్యం నెరవేరేనా!

ప్రభుత్వ స్కూళ్లపై

గురుకులాల ప్రభావం

హనుమకొండ జిల్లాలో 4,131 మంది.. వరంగల్‌లో 3,896 మంది

విద్యార్థుల నమోదు

వరంగల్‌ జిల్లాలో 3,896 మంది విద్యార్థులు

వరంగల్‌ జిల్లావ్యాప్తంగా మంగళవారం వరకు 3,896 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అనుకున్న మేర విద్యార్థుల నమోదు ప్రక్రియ కావడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లాలో ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 568 ఉండగా అందులో అసలు విద్యార్థులే లేని పాఠశాలలు 135 ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలు గు పాఠశాలలే తెరుచుకున్నాయి. అసలే విద్యార్థులు లేని పాఠశాలల టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement