గుంటూరు మెడికల్: వివాహ వయస్సుపై ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం మాతృమరణాలపై కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మే నెలలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నుదురుపాడు, జాగర్లమూడిలో జరిగిన రెండు మాతృ మరణాలపై సమీక్షించారు. నివారించదగిన కేసులని కమిటీ సభ్యులు తీర్మానించారు. డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బంది, వివాహ వయస్సు విషయంలో ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగ పిల్లలకు 21 సంవత్సరాలపై ప్రజలలో సామాజిక కోణంలో అవగాహన కల్పించాలన్నారు. వీలైనంత త్వరగా గర్భిణులను గుర్తించి, నమోదు చేయడం, ప్రమాదకరమైన గర్భిణులను ముందుగా గుర్తించి, అవసరాన్ని బట్టి పైస్థాయి ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయాలని సూచించారు. వారు కాన్పు అయ్యేంతవరకు, సకాలంలో, వైద్య సేవలు, సలహాలు, అందిస్తూ, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణ చర్యలు, ధనుర్వాత నిరోధక టీకాలు, ప్రతి నెల జరిగే ప్రధానమంత్రి మాతృత్వ, సురక్షిత యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసీజీ, స్కానింగ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో మాతృమరణాల జిల్లా నోడల్ అధికారి డాక్టర్ అమర్తలూరి శావణ్ బాబు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ఇన్చార్జి హెచ్ఓడీ గైనకాలజీ డాక్టర్ అనూరాధ, న్యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ ఆదిత్య ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డీపీహెచ్ఎన్ఓ ఇన్చార్జి డాక్టర్ ప్రియాంక, డెమో బి.శివసాంబిరెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి


