గుంటూరు రూరల్: ప్రకృతి వ్యవసాయంలో 30 రకాల విత్తనాలు కలిపి పచ్చి రొట్ట పైరుగా వేసుకుంటే అధిక దిగుబడు సాధించవచ్చని ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ రాజకుమారి తెలిపారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని రైతు నేస్తం ఫౌండేషన్లో నాబార్డు సహకారంతో ప్రకృతి వ్యవసాయంపై రైతు శిక్షణ తరగతులు సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పీఎండీఎస్ కిట్లలో 30 రకాల విత్తనాలు ఉంటాయని చెప్పారు. పప్పు జాతి గింజలు, నూనె గింజలు, ధాన్యపు గింజలు, సుగంధ ద్రవ్యాలు, పచ్చి రొట్ట విత్తనాలు(జనుము, జీలుగ, అవిశ, గ్లైరిసీడియా) ఉంటాయన్నారు. వీటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని పొలంలో విత్తుకోవాలని సూచించారు. వర్షం పడేదాకా ఆగకుండా ముందుగానే విత్తనాలకు బూడిద, మట్టి, ఘనజీవామృతంతో విత్తనాలకు కోటింగ్ ఇచ్చి పొడిలోనే వేసుకోవచ్చన్నారు. ఈ విధంగా విత్తనాలకు కోటింగ్ ఇవ్వడం వలన వర్షాలు ఆలస్యమైనా విత్తనాల పాడు కావని, వర్షం పడిన తర్వాత బాగా మొలకెత్తి ఎటువంటి చీడపీడలు ఆశించకుండా పంట బాగా వస్తుందని చెప్పారు. కార్యక్రమలో రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర రావు, రైతు నాగ మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్
రాజకుమారి


