భక్తిశ్రద్ధలతో శివరాత్రి వేడుకలు
మంగళగిరి టౌన్: మహాశివరాత్రి పర్వదినం భక్తకోటిలో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతులు నింపింది. పరమేశ్వర పాహిమాం, శివశివ శంకర.. భక్త శుభంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. మహాశివుడు విశేష పూజలందుకున్నాడు. లయకారుడు లంకేశ్వరుడు కరుణ కోసం ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరారు. ఉపవాసాలు ఆచరిస్తూ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రంతా భక్తులు జాగరణ చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని శివాలయాలతో పాటు పలు ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. అభిషేక ప్రియుడైన భోళాశంకరుడికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉదయం నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. పాత మంగళగిరిలోని శ్రీహరిహర క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలు సేవా సంస్థలు అన్నదాన తదితర కార్యక్రమాలు నిర్వహించాయి. ఆలయాల వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, ఆయా ఆలయాల కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో శివరాత్రి వేడుకలు


