మహాకాళేశ్వరుడికి విశేషపూజలు
ఫిరంగిపురం: మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శివాలయాల్లో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వేములూరిపాడులోని జలపాలేశ్వరుడికి, ఫిరంగిపురంలోని కాళహస్తీశ్వరస్వామికి, రామాలయంలోని నగరేశ్వరస్వామికి, వేమవరంలోని మహాకాళేశ్వరుడికి అర్చకులు విశేషపూజలు చేశారు. వేమవరంలోని కోటిలింగాల క్షేత్రంలోని మహాకాళీ సమేత మహాకాళేశ్వరుడికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ముఖమండపం వద్ద అన్నపూర్ణాదేవి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి భక్తుల స్వహస్తాలతో అక్షయ బియ్యంతో అభిషేకాలు నిర్వహింపజేశారు. అనంతరం ఏడు అడుగుల వెంకటేశ్వరుడి విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేశారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కోటి లింగాల క్షేత్రంలో కరసేవకులుగా పనిచేసేందుకు తుని, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, ఆరేపల్లి ముప్పాళ్ల, గుంటూరు, కడియం, మేడికుండూరు ప్రాంతాల నుంచి సుమారు 300 మంది వరకు వచ్చారు. నుదురుపాడు పీహెచ్సీ ఆధ్వర్యంలో భక్తుల కోసం వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శౌరిజోజి తెలిపారు.
కోటిలింగాల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మహాకాళేశ్వరుడికి విశేషపూజలు


