పెదకాకానిలో భక్త జన సందోహం
భక్తులతో కిటకిటలాడిన పెదకాకాని శివాలయం శివనామస్మరణతో మార్మోగిన శివసన్నిధి భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రముఖులు ఒక్కరోజులో స్వామివారి ఆదాయం రూ.6,50,000
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం మహాశివరాత్రి రోజున శివనామస్మరణతో మార్మోగింది. పెదకాకాని శివాయలంలో ఆదివారం భ్రమరాంబ అమ్మవారు స్వర్ణ కవచాలంకృత భ్రమరాంబదేవిగా భక్తులను అనుగ్రహించారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కళకళలాడింది. భక్తులు పొంగలి నైవేధ్యాలతో ఓం నమఃశివాయ నామం స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా క్యూలైనులు ఏర్పాటు చేసి భక్తులకు సకాలంలో స్వామి వారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూలైనులలో నిల్చున్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు. మహాశివరాత్రి స్వామివారి కల్యాణం కావడంతో ఆలయాన్ని పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులందరికి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం, వర్తక సంక్షేమ సంఘం, శివాలయం మాజీ ట్రస్టు బోర్డు సభ్యులు పెండెం విజయ్, దూపాటి వెంకట్రావుల ఆధ్వర్యంలో ఉచితంగా అన్నప్రసాద వితరణ చేశారు. గూడూరి రామకృష్ణ, కాకతీయ యూత్, ఆర్యవైశ్య సంఘం, జనసేన పార్టీ, పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో పులిహోర, పొంగలి, దద్ధోజనం ఉచిత ప్రసాద పంపిణీ చేశారు. ఒక్కరోజులో స్వామి వారికి వివిధ సేవా కార్యక్రమాల ద్వారా రూ.6,50,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. రాత్రి వేళల్లో కాలక్షేపంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో కళకళలాడుతుంది.
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు
మల్లేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, కురుపాం ఎమ్మెల్యే టి జగదీశ్వరీ, హైకోర్టు న్యాయమూర్తి రవీంద్రబాబు, గుంటూరు 5వ నెంబరు జిల్లా జడ్జి నీలిమలు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చక స్వాములు, వేదపండితులు వేద ఆశ్వీరవచనం చేయగా ఆలయ అధికారులు, స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
రుద్రాభిషేకం
శివరాత్రి సందర్భంగా రాత్రి 11 గంటలకు లింగోద్భవ కాలమున స్వామి వారికి ఏకాదశ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. 12గంటలకు గజవాహనంపై ఎదుర్కోలోత్సవం, తెల్లవారు జాము న 2 గంటలకు గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ పునః నిర్మాణ దాతలు కొల్లిపర వంశీకులు అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాలతలంబ్రాలు సమర్పించారు.
పెదకాకానిలో భక్త జన సందోహం
పెదకాకానిలో భక్త జన సందోహం
పెదకాకానిలో భక్త జన సందోహం


