నేటి నుంచి తెలుగులో తీర్పులు
తెనాలి రూరల్: మాతృ భాష వారోత్సవాలను పురస్కరించుకొని కోర్టు తీర్పులు వారం రోజులపాటు తెలుగులోనే వెల్లడించనున్నట్లు ప్రధాన పౌర న్యాయమూర్తి(కనిష్ట విభాగం) ఏకా పవన్కుమార్ ఆదివారం తెలిపారు. తీర్పులు ప్రజల మాతృభాషలో ఉంటేనే, న్యాయస్థానాలను ఆశ్రయించే వారికి తాము ఎందుకు గెలిచామో, ఎందుకు ఓడామో కూడా స్పష్టమవుతుందని చెప్పారు. సాధ్యమైనంత వరకూ న్యాయస్థాన తీర్పులు మాతృభాషలోనే ఇవ్వడం మంచిదనీ భారత ఉన్నత న్యాయస్థానం సూచించిన విధంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెనాలిలోని రెండో అదనపు పౌర న్యాయమూర్తి (కనిష్ట విభాగం) పల్లగాని రాజశేఖర్ కూడా ఇటీవల తెలుగులో ఒక తీర్పు వెల్లడించడం తెలిసిందే. తెలుగులో తీర్పులు రావడం చాలా ముదావహమని, కేవలం న్యాయం కోసం వచ్చే వారికే కాక, ప్రజలందరికీ కూడా న్యాయస్థాన తీర్పులు అర్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందనీ ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నట్లు వారు వెల్లడించారు.


