
పేదింటి తల్లులకు గుండెకోత
నా పేరు గరిక ఝాన్సీ...మాది కొల్లిపర. కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తుంటాం. మాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. రెక్కల కట్టం చేస్తూనే ముగ్గురిని చదివిస్తున్నాం. ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీనిచ్చింది. శుక్రవారం తల్లికి వందనం పేరుతో ముగ్గురికి రూ.39 వేలు వస్తాయని ఎంతో సంబరపడ్డాం. తీరా చూస్తే ఒక్కరికీ కూడా రాలేదు. పదో తరగతి పూర్తిచేసిన ఇద్దరు పిల్లల పేర్లు లేవు. చిన్నది ప్రణతి లక్ష్మి పేరు అనర్హుల జాబితాలో ఉంది. సరైన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించలేదని కారణం చూపారు. చాలా బాధగా ఉంది. కూలి చేసుకునే జీవించే తమలాంటి పేదలకు ప్రభుత్వ పథకాల సాయం అందకపోతే ఎలా...ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయాలి.
తెనాలి: అమ్మ ఒడి పథకాన్ని పేరుమార్చి తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కూటమి నేతలు ఎన్నికల సభల్లో ఇచ్చిన హామీని గతేడాది అమలు చేయనేలేదు. ప్రస్తుతం పథకం వర్తింపునకు పలు ఆంక్షలు విధించింది. ఫలితంగా ఎందరో మహిళలు అనర్హుల జాబితాలో చేరారు. సీబీఎస్ఈతోపాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు జాబితాల్లో కనిపించడం లేదు. 2024–25 విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకోలేదు. టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరితేనే వారికి లబ్ధి కలుగుతుంది. సీనియర్ ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులను అనర్హులుగా తేల్చారు. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి సాయం అన్న కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం తెనాలి నియోజకవర్గంలో కనీసం 30 వేల మంది విద్యార్థులకు రూ.13 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. అధికారికంగానే 22,320 మందికి మాత్రమే వర్తింపజేశారు. వీరిలోనూ చాలామంది అనర్హతతో అవకాశం కోల్పోయారు.
ఆదాయం ఉంటే పథకం దూరం
విద్యుత్ వినియోగం, నెలసరి ఆదాయాన్ని పరిశీలనలోకి తీసుకుని లబ్ధిదారుల్లో కోతను విధించినట్టు స్పష్టమవుతోంది. గ్రామీణులకు నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించిన ఆదాయం ఉంటే పథకానికి దూరమయినట్టే. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించిన వారినీ దూరం పెట్టారు. ఇలాంటి ఆంక్షలతో తెనాలి నియోజకవర్గంలో వందల సంఖ్యలో అనర్హులుగా మారారు.
సాయంలో కోత
తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున మాత్రమే జమచేశారు. మిగిలిన రూ.2 వేలను పాఠశాలల అభివృద్ధి నిధికి కేటాయించారు. ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ల ఆధీనంలో ఉంచారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే విధానాన్ని అమలుచేస్తే, అప్పట్లో ప్రతిపక్షంలోని నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ బాటనే అనుసరిస్తుండటం గమనించాల్సిన అంశం.
సంవత్సరం లబ్ధిదారులు ఆర్థికసాయం
2019–2020 25,850 రూ. 38,77,50,000
2020–2021 25,471 రూ. 38,20,65000
2021–2022 21,213 రూ. 31,81,95000
2022–2023 20,857 రూ. 31,81,55,000
అర్హతలున్నా అందని ‘తల్లికి వందనం’ ప్రభుత్వ ఆంక్షలతో అనర్హత వేటు పథకం సాయం అందని తల్లుల్లో నిరాశ
జగన్ పాలనలో తెనాలి నియోజకవర్గంలో అందిన సాయం
గ్రీవెన్స్లో పెట్టుకోమంటున్నారు
నా కుమారుడు తెనాలిలోని మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం పథకానికి రేషను కార్డు సహా అన్ని అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ అర్హుల జాబితాలో పేరు లేదు. అదేమని అడిగితే గ్రీవెన్స్లో పెట్టుకోమని సమాధానం చెబుతున్నారు.
– బొంత శ్రీనివాసరావు, కఠెవరం
కారణం చెప్పడం లేదు
నా కుమార్తె తెనాలిలోని సెయింట్జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఒకటో తరగతి చదివింది. ప్రస్తుతం రెండో తరగతి. తల్లికి వందనం పథకానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకనో మా పేరు అనర్హుల జాబితాలో ఉంది. ఎందుకని అడిగితే కారణం చెప్పటం లేదు.
– కర్ర భవాని, కఠెవరం

పేదింటి తల్లులకు గుండెకోత

పేదింటి తల్లులకు గుండెకోత