
గుంటూరు: వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులతో అణచలేరని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడారు. ‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు బెయిల్ పై విడుదల కావడం జరిగింది..సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు అనంతరం ఆయనను విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించింది..
కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసుల పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రావటం లేదు అని కొమ్మినేని శ్రీనివాసరావు పై లక్ష్యకట్టి అరెస్ట్ చేశారు..చీమకి కూడా హాని చేయకుండా కలం కోసం పని చేస్తున్న జర్నలిస్ట్ను జైలులో పెట్టడం దుర్మార్గం.
పోలీసుల అదుపులో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు పై అరమరావతి రాజధాని ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నం చేశారు..రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత కేవలం మైక్ ముందే హోం మంత్రి.. ఇకపై డిబేట్లు పెట్టే అవకాశం లేదు అంటూ హోం మంత్రి అనిత మాట్లాడడం సిగ్గుచేటు. చీకటి పడిన తరువాత కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని చంద్రబాబు, లోకేష్ జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..పోలీసులతో మమల్ని అణచలేరు’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.