
కృష్ణమ్మ హారతులకు మరింత ప్రాచుర్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పవిత్ర కృష్ణమ్మ పంచహారతులకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. దుర్గాఘాట్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కృష్ణమ్మ హారతులకు దుర్గగుడి ఈవో శీనానాయక్ హాజరయ్యారు. తొలుత ఆలయ అర్చకులు కృష్ణానదికి పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఈవో పసుపు, కుంకుమను సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి కూర్చుని పంచహారతులను వీక్షించారు. సాయం సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే పంచహారతులకు మరింత మంది భక్తులు విచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.