మోదీ ప్రభుత్వానికి ‘ప్రైవేటు’ పిచ్చి పట్టింది | - | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభుత్వానికి ‘ప్రైవేటు’ పిచ్చి పట్టింది

Jun 16 2025 5:47 AM | Updated on Jun 16 2025 5:47 AM

మోదీ ప్రభుత్వానికి ‘ప్రైవేటు’ పిచ్చి పట్టింది

మోదీ ప్రభుత్వానికి ‘ప్రైవేటు’ పిచ్చి పట్టింది

లక్ష్మీపురం: మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ పిచ్చి పట్టిందని, అందుకు రాష్ట్రంలో చంద్రబాబు వంతపాడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.నర్సింగరావు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో రెండు రోజుల పాటు జరిగిన యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు సభలో నర్సింగరావు మాట్లాడుతూ దేశంలో విద్యుత్‌ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రైవేటీకరణ అన్నారు. రూ.80 లక్షల కోట్ల విలువైన విద్యుత్‌ రంగం ఆస్తులను అంబానీ, అదానీకి అప్పగించటానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థల ద్వారా అధిక ధరలకు విద్యుత్‌ కొంటూ, ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరించాలని ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. విమానయానం ప్రైవేటీకరణ వల్లే ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల నిర్వీర్యం తదితర విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జులై 9న జరిగే కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ కోశాధికారి ఎస్‌.రాజేంద్రన్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్ల ప్రమాదంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా అడ్డుకోవాలని నేతలకు సూచించారు. దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని, జేఎల్‌ఎం గ్రేడ్‌–2లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 22న నెల్లూరులో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు విడుదల చేయాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పీఆర్సీ ఎరియర్లు ఇవ్వాలని, రెగ్యులర్‌ చేయాలని, ఈపీఎఫ్‌ హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్లు తిరస్కరించిన ఉద్యోగులందరికీ పెన్సన్‌ రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని మహాసభ తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. క్యూబా సంఘీభావ నిధికి మహాసభ ప్రతినిధులు రూ.12610 అందించారు.

నూతన కమిటీ నియామకం

యూనియన్‌ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డి.సూరిబాబు, పి.సుదర్శన్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా ఎల్‌.రాజు, ఉపాధ్యక్షులుగా సీహెచ్‌.నాగబ్రహ్మాచారి, వి.సత్యనారాయణ, జి.వి.శివప్రసాద్‌, పి.ప్రసాద్‌, ఆర్‌.సత్యారావు, జాయింట్‌ సెక్రెటరీలుగా జాకీర్‌ హుస్సేన్‌, డి.వెంకటేశ్వరరావు, జె.శ్రీనివాసరావు, సీహెచ్‌.వీరాంజనేయులు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీలుగా కె.కిరణ్‌కుమార్‌, నాయబ్‌ రసూలు, పి.శివప్రసాద్‌రెడ్డి, కె.హజరత్తయ్య, మహిళా ప్రతినిధిగా వి.క్రాంతి సహా మొత్తం 39 మందితో నూతన కమిటీ ఎన్నికై ంది.

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి నర్సింగరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement