
అలరించిన వైద్యురాలి కూచిపూడి నృత్యం
నగరంపాలెం: స్థానిక జిల్లా కోర్టు రోడ్డులోని గుంటూరు వైద్యకళాశాల (జీఎంసీ) ఆవరణలోని జింఖానా ఆడిటోరియంలో శనివారం వైద్యురాలు కంభంపాటి అపర్ణ కూచిపూడి నాట్య అరంగేట్రం చేశారు. వేదాంతం కళాక్షేత్రం (యూఎస్ఏ) వ్యవస్థాపకులు వేదాంతం రాఘవ, బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథశర్మ, బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచలశాస్త్రి, వైద్యులు హనుమంతురావు, కంభంపాటి మహాదేవ, వరలక్ష్మి దంపతుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేదాంతం రాఘవ శిష్యురాలైన డాక్టర్ అపర్ణ కూచిపూడి రంగప్రవేశం చేశారు. సంప్రదాయ ప్రార్థనతో మొదలై, పలు కూచిపూడి నృత్యాలకు ఆమె నాట్యం చేశారు. అమెరికాలో ఉంటున్న అపర్ణ దేశ సంస్కృతిని పరిరక్షిస్తూ, తొమ్మిదో ఏటనే నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిందని వక్తలు పేర్కొన్నారు. ఒకవైపు వైద్య వృత్తిని అభ్యసిస్తూ, నాట్యంపై అభిలాష పెంపొందించుకోవడం అభినందనీయమని తెలిపారు. విద్యలో రాణిస్తూ, కూచిపూడిలో ప్రతిభ చూపడం గొప్ప విషయమని కొనియాడారు.