ప్రజాస్వామిక వ్యవస్థలో బలమైన నాలుగు వ్యవస్థలున్న నేపథ్యంలో మూడు వ్యవస్థలు దిగజారిపోయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నాయి. నాలుగవ స్తంభమైన పత్రికా స్వేచ్ఛ కనీసంగానైనా సోషల్ మీడియా పరంగా యూట్యూబ్లతో ప్రజల విశ్వాసంలో ఉన్నది. నేషనల్ మీడియా రాష్ట్రాల పత్రికలన్ని కూడా అధికార పార్టీల కనుసన్నల్లో వార్తను బంధీ చేసి ఉన్నాయి. గతంలో చేగువేరతో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ ఎక్కడ తేలాడో మనందరికి తెలుసు. అతని మాటలకు, ఆచరణకు చాలా వ్యత్యాసం కనబడింది. చివరికి తాను మాట్లాడిన అప్రజాస్వామిక పదజాలాన్ని ప్రశ్నా రావణ్ అనుకరించడం నాలుగు పోలీస్ స్టేషన్లలో బెయిల్ తో విడుదలైన తరువాత ఐదవ పోలీస్ స్టేషన్లో అప్రజాస్వామిక నిర్బంధ చట్టమైన ఉపా చట్టంతో అతనిని నిర్బందానికి గురి చేశారు. గతంలో టాడా, పోటా, నేపథ్యాల నుంచే ఉపా చట్టం వచ్చిన తరువాత ఉపా ఎంతగా ప్రశ్నించే గొంతులపై అణచివేతను, నిర్బంధాన్ని అమలు చేస్తున్నదో 2018 భీమాకొరెగావ్ ఉపా కుట్ర కేసు నుంచి మనందరికి అర్థమవుతున్న విషయం. కేవలం బెయిల్ దొరకకుండా ఆ ప్రశ్నను, ఆ నిరసన గొంతును నిశ్శబ్దం చేయడం కోసం పాలక వర్గాలు అనుసరిస్తున్న బలమైన అణచివేత విధానంగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నది.
అందులో భాగంగానే 84 ఏండ్ల ఫాదర్ స్టాన్ స్వామి జార్ఖండ్ లోని ఆదివాసీల కోసం న్యాయ స్థానంలో చట్టపరంగా బలమైన పోరాటాలు నిర్వహించినందుకు ఆగ్రహించిన ప్రభుత్వం జైలులోనే హత్య చేసింది. అదే విధంగా 90 శాతం వికలాంగుడైన ప్రొ. సాయిబాబా కూడా ఆదివాసీల పక్షాన మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు అక్రమ కేసులో అన్యాయమైన శిక్షతో 10 ఏండ్లపాటు జైలు నిర్బంధానికి గురి చేస్తే అతను కూడా మరణించడం జరిగింది. ఇలా పీడిత ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన అణగారిన వర్గాల పక్షాన నేడు బుద్ధిజీవులు మేధావులతో పాటు య్యూట్యూబర్లు కూడా తమ ఛానెళ్ళ ద్వారా ప్రజలకు ప్రశ్నించడం నేర్పుతున్నారు. ఆ నేర్పడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అన్న మాటలను పునరుచ్చరణ చేసినందుకు అదే నేరంగా వరుసగా కేసులు నమోదు చేశారు. నమోదు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రశ్నారావణపై, న్యాయస్థానానికి తరలిస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో గోడలు దూకి మరీ ప్రశ్నారావణపై భౌతిక దాడికి జనసేన కార్యకర్తలు పాల్పడ్డారు. జనసైనికులు, చట్టవిరుద్ధంగా వ్యవహరించడ మంటేనే పవన్ కళ్యాణ్ బాధ్యతపడాల్సిన అవసరం ఉంది.
అదే మాదిరిగా ఈ నెల ఒకటిన మరో జర్నలిస్టు కె. వి. ఆర్. ఇంటి మీద దాడి చేసి ఎపి పోలీసులు అమాంతంగా ఎత్తుకు పోయారు. పోలీసులకు హద్దులు పరిమితులు పని చేయవు. పేదలకు అన్యాయం జరిగినపుడు పోలీసు స్టేషన్ కెళితే మా పరిధి కాని హింసించిన ఉదాహరణలెన్నో ఉన్నాయి. కె.వి.ఆర్. ను ఎత్తుకు పోవడానికి ముందు మఫ్టీలో వున్న ఎపి పోలీసులు రెక్కి నిర్వహించారు. మీరెవరు నా భర్తను ఎందుకు తీసుకు పోతున్నారని అడుగితే, నేను కూడా నా భర్త వెంబడి వస్తానంటే ఆమెను లాగిపడేశారు. పైగా భాగ్యలక్ష్మీపై కూడా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో కుటుంబీకులుకు తెలియజేసే చట్టబద్దమైన బాధ్యత పోలీసులపై వుంది. పోలీసులకు చట్టాన్ని బేఖాతరు చేయమని పాలకులు మౌఖిక ఆదేశాలిస్తున్నారు. ఈ అరెస్టులకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.
వాక్ సభా స్వాతంత్ర్యాలకు రాష్ట్రంలో తీవ్ర విఘాతం కలుగుతుంది. గొంతు విప్పి మాట్లాడితే నేరం అవుతుంది. అంత్యక్రియల్లో మాట్లాడిన గాదె ఇన్నయ్యను జైలుపాలు చేసి 8 నెలలుగా బెయిలు లేకుండా నిర్బంధించారు.
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అన్నీ వ్యవస్థలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడిన ప్రభుత్వాలు వ్యక్తులు పత్రికా స్వేచ్ఛను గౌరవించడం ఇబ్బందిగా ఫీలవుతారు. ఆ నేపథ్యంలోనే ప్రశ్నారావణపై చట్టపరంగా పోరాటం చేయాల్సిన స్థితి కాకుండా అక్రమ ఉపా కేసులు నమోదు చేసి భౌతిక దాడులకు పాల్పడడం అదే విధంగా కేసులు చేస్తున్న జడ శ్రావణపై కూడా కేసులు నమోదు చేస్తామని ప్రకటించడం లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలుగా పౌరహక్కుల సంఘం భావిస్తూ ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ప్రభుత్వాలలో పాలకులుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలే రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు మాత్రం ఎందుకు పాటించాలనే ఒక మౌళిక ప్రశ్న బలల్దేరుతుంది. అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నారావణ్ పై కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా నమోదు చేసిన ఉపా కేసుతో పాటు అన్ని కేసులను బేషరతుగా ఎత్తివేసి అతన్ని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.
తెలంగాణలో కూడా గత కొద్ది నెలల క్రితం కొన్ని య్యూట్యూబ్ ఛానెల్లపై ఎన్.ఐ.ఎ. తరహా నిర్బంధాలు బలంగానే కొనసాగాయి. ఆ నిర్బంధాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధం లేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కానీ శాంతి భద్రతలనేవి కేవలం రాష్ట్రానికి సంబంధించినదే, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ య్యూట్యూబ్ ఛానెల్ల పట్ల పత్రికల పట్ల ప్రజాస్వామ్యబద్ధమైన వైఖరితో తమ పాలన కొనసాగించాలి. కనిపించ కుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్న అన్ని పత్రికలపై య్యూట్యూబ్లపై ఆ నిర్బంధాన్ని ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడగలిగితేనేకనీసంగానైనా ప్రజాస్వామ్యం నిలబడు తుంది. లేకపోతే నిర్బంధమే రాజ్యమేలుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది. అప్పుడు ప్రజల దగ్గరకి ప్రజాస్వామ్య విలువల కోసం వెళ్ళడానికి మీకు అవకాశం ఉండదు. కాబట్టి పత్రికలపై య్యూట్యూబ్ ఛానెళ్ళపై నమోదు చేసిన అన్ని అక్రమ కేసులను ఎత్తివేయాల్సిందిగా ప్రభుత్వాలను పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
పౌరహక్కుల సంఘం (CLC) తెలంగాణ రాష్ట్ర కమిటీ
ప్రొ. గడ్డం లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్. నారాయణ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాల కృష్ణ, సహాయ కార్యదర్శి,


