ఈ వారం కథ: ఆగిపోయిన వాచీ! | The Story 'Aagipoyina Watch' By Sri Sudhamayi Funday Short And Crime Story | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: ఆగిపోయిన వాచీ!

Jun 14 2026 10:28 AM | Updated on Jun 14 2026 10:28 AM

The Story 'Aagipoyina Watch' By Sri Sudhamayi Funday Short And Crime Story

క్లూషియల్‌

నగరం శివార్లలోని విల్లాలో వ్యాపారవేత్త పాండురంగారావు తన బెడ్‌రూమ్‌లో రక్తం మడుగులో శవమై పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న క్రైమ్‌ బ్రాంచ్‌ ఇ¯Œ స్పెక్టర్‌ అభిమన్యు తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. శవం పక్కనే పాండురంగారావు చేతి గడియారం పగిలిపోయి పడి ఉంది. ఆ వాచీ ముల్లు సరిగ్గా రాత్రి 12:00 గంటల దగ్గర ఆగిపోయింది.

పాండురంగారావు భార్య గత సంవత్సరమే రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు.
ఇంట్లో కొత్తగా చేరిన వంటమనిషి పాండే, పనిమనిషి మంగ, తోటమాలి రంగయ్య ఆ ముగ్గురినీ విడివిడిగా విచారించాడు.
పనిమనిషి మంగ వణుకుతూ, ‘‘సార్, నేను రాత్రి 11:30 నుండి ఒంటి గంట వరకు ఊరి గుడి జాతరలో ఉన్నాను. వందలమంది నన్ను చూశారు’’ అంది. అందుకు సాక్ష్యం కూడా చూపించింది.

ఇక తోటమాలి రంగయ్యను విచారించగా, అతను రాత్రి 12:00 గంటల సమయంలో ఊరి సరిహద్దులో ఒక చిన్న దొంగతనం చేస్తూ లోకల్‌ పోలీసులకు దొరికి లాకప్‌లో ఉన్నాడని తెలిసింది.
వంటమనిషి పాండే రాత్రి 9:30 గంటలకు తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
అభిమన్యుకు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ చూశాక అనుమానం వచ్చింది. రిపోర్ట్‌ ప్రకారం పాండురంగారావు తిన్న ఆహారం జీర్ణమైన విధానాన్ని బట్టి హత్య రాత్రి 9:30 నుండి 10:30 మధ్య జరిగింది.

అలాంటప్పుడు వాచీ ముల్లు 12 గంటలకు ఎలా ఆగిపోయింది. చనిపోయిన తర్వాత వాచీ పగిలి పడి ఉండటం ఏమిటి?
‘అంటే హంతకుడు కావాలనే వాచీ ముల్లును 12 గంటలకు తిప్పి, దాన్ని పాడు చేసి ఇక్కడ పడేశాడు.’ అని అభిమన్యు గ్రహించాడు.
హత్య జరిగిన ఇంట్లో పాండురంగారావు కాకుండా వున్నది ముగ్గురే! వారి గురించి విచారణ మొదలుపెట్టాడు.
ఆధారాల కోసం వంటమనిషి పాండే గురించి బిహార్‌ పోలీసులను సంప్రదించాడు. షాకింగ్‌ విషయం తెలిసింది.

వంటమనిషి పాండే బిహార్‌కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ ప్రొఫెషనల్‌ కిల్లర్‌. అతని దగ్గర ఉన్న మరో ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే, ఆ ఫోన్‌లో తోటమాలి రంగయ్యతో పాండే మాట్లాడిన కాల్‌ డేటా దొరికింది. పాండురంగారావును హత్య చేయడానికి తోటమాలి రంగయ్య కుట్ర బట్టబయలు అయ్యింది. పాండురంగారావు హత్యానేరం తన మీద రాకుండా రంగయ్య తనే స్వయంగా రాత్రి 12 గంటలకు దొంగతనం కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఎందుకంటే పోలీసుల రికార్డుల ప్రకారం రాత్రి 12 గంటల హత్య సమయానికి తను సేఫ్‌గా లాకప్‌లో ఉండవచ్చని అతనికి తెలుసు.

వెంటనే రంగయ్య గురించి కూపీ లాగితే, అతను చాలాసార్లు జైలుకు వచ్చినట్టు తెలిసింది. ములాఖత్‌ పేరుతో ఫణిభూషణ్‌రావు అనే ఖైదీని కలిసినట్టు రికార్డ్స్‌లో బయట పడింది. అక్కడే అసలు ట్విస్ట్‌ బయటకు వచ్చింది.
ఫణిభూషణ్‌రావు కొడుకు హరిభూషణ్‌ మరెవరో కాదు– ‘తోటమాలి రంగయ్య.’
రంగయ్యగా పేరు మార్చుకుని, రూపురేఖలు మార్చుకుని పగ తీర్చుకోవడానికి పనిలో చేరాడు.

పాండురంగారావు తన దగ్గర  పనిచేసే ఫణిభూషణ్‌రావు ఆఫీస్‌ లెక్కలను తారుమారు చేయడంతో పోలీసులకు పట్టించి జైలుకు పంపించాడు. ఆ కసితో అతని కొడుకు  హరిభూషణ్‌  వేసిన క్రిమినల్‌ ప్లాన్‌ ఇది.
బిహార్‌కు చెందిన వంటమనిషి పాండే గదిని సోదా చేసినప్పుడు, అతని డైరీలో కొన్ని వింత సమయాలు రాసి వున్నాయి.
నిజానికి భారతదేశంలో ఒకే టైమ్‌ జోన్‌  ఉన్నప్పటికీ, తూర్పు ప్రాంతమైన బిహార్‌లో సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. పాండే తన మునుపటి నేరాల్లో ఎప్పుడూ ఒక వింత అలవాటు కలిగి ఉండేవాడని అతని పాత క్రిమినల్‌ రికార్డుల ద్వారా తెలుసుకున్నాడు అభిమన్యు

పాండే  కావాలనే రాత్రి 10:00 గంటలకే పాండురంగారావును చంపి, వాచీ ముల్లును రాత్రి 12:00 గంటలకు తిప్పి, దాన్ని పాడుచేసి అక్కడ పడేశాడు. పోలీసులను రాంగ్‌ ట్రాక్‌ పట్టించే ప్రయత్నం చేశాడు.
కానీ క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు సేకరించిన ఎవిడెన్స్‌ ముందు తలవంచి జైలుకు వెళ్ళక తప్పలేదు.
తండ్రి ఫణిభూషణ్‌ చేసిన వ్యాపార మోసం కేసుకు కేవలం 8 ఏళ్ల జైలు శిక్ష పడితే, ఆ పగను మనసులో పెట్టుకుని, విచక్షణ మరచి, ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌తో క్రూరంగా హత్య చేయించినందుకు గాను కోర్టు హరిభూషణ్‌కు, హత్య చేసినందుకు పాండేకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. - శ్రీసుధామయి

  • క్రైమ్‌ కథలకు ఆహ్వానం..
    ఉత్సాహవంతులైన రచయితల నుంచి క్రైమ్‌కథలను ఆహ్వానిస్తున్నాం. ఉత్కంఠ తగ్గకుండా పాఠకులతో చదివించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలను ఈ శీర్షిక కోసం పంపండి. కథల నిడివి 450 పదాలకు మించరాదు. కథతో తప్పనిసరిగా హామీపత్రం ఉండాలి. కథలను తెలుగు యూనికోడ్‌లో టైప్‌ చేసి ఈ దిగువనున్న ఈ–మెయిల్‌కు పంపాలి. funday.kathalu@gmail.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement