లక్ష జీతం, కారు, ఫ్లాట్‌.. వరుడికి కొత్త రూల్స్! | Youth Marriage Trends In Chittoor, Delayed Weddings, High Expectations And The Rise Of Matrimony Brokers | Sakshi
Sakshi News home page

లక్ష జీతం, కారు, ఫ్లాట్‌.. వరుడికి కొత్త రూల్స్!

Mar 29 2026 12:47 PM | Updated on Mar 29 2026 2:17 PM

Modern Marriage Trends Youth High Expectations Delay Weddings

మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. రెండు మనసులు కలిసి ఒకటిగా మారేది పెళ్లి. ఇది కొత్త జీవితానికి అంకురార్పణ. అగి్నసాక్షిగా ఏడు అడుగులతో మొదలయ్యే ఈ కొత్త పయనం జీవితాంతం తోడుంటాననే మధుర వాగ్దానంతో ముందుకు సాగుతుంది. ఈ అపురూపమైన పెళ్లి బంధాన్ని ప్రస్తుతం యువతీ యువకులు ఒక వ్యాపారంగా మార్చేశారు. గతంలో పెళ్లిని పెద్దలు కుదిర్చేవారు. ఇప్పుడు యువతీయువకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. చివరకు ఒంటరితనమనే శిక్షను చేతులారా తమకు తామే వేసుకుంటున్నారు. వయసు ముదురుతున్న కొద్దీ కనిపించిన వారంతా ఏంబా ఇంకా పెళ్లి చేసుకోలేదా అనే సూటిపోటి మాటలను తట్టుకోలేకపోతున్నారు. దీంతో మళ్లీ పెద్దలకు చెప్పి ఏ సంబంధమైనా సరే నేను రెడీ అంటున్నారు. ఈ వయసు వారికి పెళ్లి కావడం కష్టంగా పరిణమించింది.  

చిత్తూరు: నేటితరం అబ్బాయిలు పెళ్లితో ఆర్థికంగా ఎదగాలని భావిస్తున్నారు. తాను ఎలాగున్నా అమ్మాయి మాత్రం అందంగా ఉండాలి. కచ్చితంగా తాను చేసే ఉద్యోగమే అయి ఉండాలి. భారీగా కట్నకానుకలు ఇవ్వాలని భావిస్తున్నారు. జీవితాంతం కలిలి ఉండే భార్యని డబ్బులు తెచ్చే అందమైన యంత్రంగా.. అదో ఫ్యాకేజీగా మార్చేశారు. దీంతో అలాంటి అమ్మాయిల కోసం వేటాడుతూ ఉన్న జీవితాన్ని కోల్పోతున్నారు. 30 ఏళ్లు దాటాక కనువిప్పు కలిగి ఏదో ఒక సంబంధమైనా సరే అని సాగిలపడుతున్నారు.  



ఎలాంటి సంబంధమైనా ఓకే అన్నా కష్టమే 
వయసు ముదిరాకగాని అనేక మంచి సంబంధాలను వదులుకున్నామనే బాధ తెలిసి వస్తోంది. అప్పటికీ పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకురాని పరిస్థితి కలుగుతోంది. ఇదే సమయంలో బంధువులు, స్నేహితుల నుంచి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న మాటలు వినిపిస్తాయి. ఆపై తల్లిదండ్రుల మాట వింటూ ఏ సంబంధమైనా చూడడండనే మాటలు వస్తున్నాయి. మొత్తానికి అప్పటికి పెళ్లి కష్టంగా మారిపోతుంది. మొత్తం మీద పెళ్లి అనేది జీవితం కాదని, అదో జీతాల లెక్కని అనుకునే వారికి చివరికి తనకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు. జిల్లాలో 30 ఏళ్లు దాటి పెళ్లికాని యువతీ యువకుల సంఖ్య 16 వేల వరకు ఉన్నట్టు అంచనా. ఇప్పటికైనా యువత మేలుకుని తన పంథాను మార్చుకుని సరైన వయసులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలి.

లేని ఆశలు నింపుతున్న మ్యారేజీ బ్రోకర్లు 
ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యారేజీ బ్రోకర్లు, మ్యారేజి బ్యూరోలే పెళ్లి సంబంధాలను చూస్తున్నాయి. వారిని ఆశ్రయించిన వారికి పలు ఆశలు పెట్టి కళ్ల ముందు స్వర్గాన్ని చూపుతున్నారు. తాను సెట్‌ చేసిన వారంతా కోట్లకు పడగలెత్తారని, కట్నకానులు భారీగా ఇప్పిస్తామంటూ ఢాంబికాలు పలికి యువతీ యువకుల్లో లేనిపోనీ ఆశలు కలి్పస్తున్నారు. తద్వారా వారి నుంచి పెద్ద మొత్తంలో కమీషన్‌ తీసుకుంటున్నారు. వారి మాటలను నమ్మిన యువతీ యువకులు పెళ్లి తర్వాత తాను పెద్ద పొజిషన్‌లోకి చేరుకుంటానంటూ కలల ప్రపంచంలో ఊగిసలాడుతూ చివరికి మూడు పదలు దాటాక గాని వాస్తవంలోకి రాలేకపోతున్నారు. ఇదంతా ఒట్టి మాటలనే నిజం చెవికెక్కించుకుంటున్నారు. అప్పటికే పుణ్యకాలం దాటిపోయి పెళ్లి కావడం కష్టంగా మారుతోంది

అమ్మాయిలేం తక్కువ కాదు 
గతంలో అమ్మాయిలు తల్లిదండ్రులు చెప్పిన సంబంధాన్ని చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువమంది భాగస్వామి ఎంపికను వారే చూసుకుంటున్నారు. అబ్బాయి అందంగా ఉండాలి. నెలకు లక్షకు పైగా జీతం రావాలి. అపార్ట్‌మెంట్‌ ఉండాలి. కారు ఉండాలి. అత్తమామలు, ఆడపడుచులు గోల ఉండకూడదు. పెళ్లయిన వెంటనే వేరు కాపురం పెట్టాలి అని పలు కండీషన్లు పెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే వీరికి భర్త కంటే వారు సెటిల్‌ అయ్యే ఓ ప్యాకేజీలా మార్చుకున్నారు. ఇలా మంచి మ్యాచ్‌ వస్తుందేమోనని చూసి చూసి ఆఖరుకు మూడు పదులు దాటాక ఒంటరితనమే మేలని భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement