నిలదీత
ఒక మహిళ గర్జన ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తోంది. రాజకీయ ర్యాలీలు, నిరసనల పేరుతో రోడ్లు బ్లాక్ చేసి, స్కూల్ పిల్లలను, అంబులెన్స్ లను, ఆఫీస్కి వెళ్లే వాళ్లను గంటలు గంటలు ఆపేయడం మామూలైపోయిన ఈ రోజుల్లో ఒక నిరసన స్వరం దేశానికి తన బాధ్యతను గుర్తు చేస్తోంది. ‘ఎవరూ మాట్లాడరులే’ అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా ఉన్న వారికి ‘సామాన్యులతో పెట్టుకోకు’ అని ఈ ఘటన చెప్పినట్టయ్యింది.
అసలేం జరిగింది?
ఏప్రిల్ 22, మంగళవారం ముంబైలోని వర్లీలో బిజెపి పార్టీ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించింది. దాంతో వర్లీ జంభోరీ మైదాన్ నుంచి డోమ్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒక స్థానిక మహిళ తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తూ గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. విసుగెత్తి పోయిన ఆవిడ కారు దిగి, నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో వాగ్వాదానికి దిగింది.
‘గెట్ అవుట్ ఆఫ్ హియర్! మీరు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్నారు’ అని నిలదీసింది. ‘వందలమంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది కదా’ అని పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చూపిస్తూ గట్టిగా అరిచింది. పోలీసులు జోక్యం చేసుకోబోతే వాళ్ల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ‘సీనియర్ ఆఫీసర్స్తోనే మాట్లాడతా’ అని తెగేసి చెప్పింది. మంత్రి మహాజన్ సర్ది చెప్పబోయినా ఆవిడ వినలేదు. వెళ్లి మళ్లీ వచ్చి ‘మీకు అర్థం కాలేదా? వందల మంది వెయిట్ చేస్తున్నారు’ అని మళ్లీ గట్టిగా అడిగింది.
ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీఐపీ కల్చర్కి చెక్ పెట్టాలని చాలామంది కోరుతున్నారు. నగరాల్లో అసలే ట్రాఫిక్ జామ్లతో బాధ పడుతున్న జనం ఈ ర్యాలీలు, ప్రదర్శనల వల్ల మరెంత అవస్థ పడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. జనం ఆగ్రహం ఇలా కట్టలు తెంచుకోక ముందే పాలనా వ్యవస్థలు మేలుకోవాలి.


