
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం కింద 2019 లో దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం వారే రాయితీ కలిగించి బ్యాంకు నుంచి హామీరహిత రుణం ఇప్పించగా, ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాను. కొన్ని నెలలపాటు వ్యాపారం బాగానే సాగింది. కానీ కోవిడ్ సమయంలో వ్యాపారం మూతపడింది. భారీ అద్దె, జీతాలు, పైగా బ్యాంకు నెలసరి వాయిదా చెల్లింపుల వలన వ్యాపారం మూతపడాల్సి వచ్చింది. అద్దె భరించలేక వ్యాపారం ఆపేసి సామాగ్రి మొత్తం అమ్మేశాము. అలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని – మా వద్ద ఉన్న నగదును కలిపి బ్యాంకు వారికి చెల్లించాము. ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. మూడు సంవత్సరాల తర్వాత బ్యాంకు వారు కోర్టు నోటీసులు పంపడమే కాకుండా ‘30 లక్షలు ఉద్దేశపూర్వకంగా చెల్లించలేదు’ అంటూ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ ఎదుర్కొనే శక్తి ప్రస్తుతానికి నా దగ్గర లేదు. పరిష్కారం చూపగలరు.– సంతోష్, నిజామాబాద్
ఈ సమస్య మీ ఒక్కరిది మాత్రమే కాదు. కోవిడ్ కి ముందు బ్యాంకు రుణాలు తీసుకున్న చాలా మంది ఇలాగే దివాలా తీయడమే కాక పలు రకాల కేసులు కూడాఎదుర్కొంటున్నారు. బ్యాంకు వారు సాధారణంగా డి.ఆర్.టి. (డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో కేసు వేసి బకాయిలను వసూలు చేసుకుంటూ ఉంటారు. మీరు పొందినది హామీ రహిత రుణం అన్నారు కాబట్టి పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. అదే విషయాన్ని మీరు డి.ఆర్.టీ.కి తెలియ జేసి, ఎలాంటి పరిస్థితులలో మీ వ్యాపారం మూతపడవలసి వచ్చినదో చెప్పండి. అలాగే మీకు సహకారం అందించిన ప్రభుత్వ విభాగానికి కూడా ఒక దరఖాస్తు పెట్టుకుంటూ ఈ విషయాలను వివరించండి.
చీటింగ్ కేసులు పెట్టడం కూడా ఈ మధ్య బ్యాంకు వారు సర్వసాధారణంగా చేస్తున్నారు. బహుశా సివిల్ కేసులలో రికవరీ కష్టం అనుకున్న సందర్భాల్లో రుణగ్రస్తులను ఒత్తిడికి గురి చేయడానికి ఇలా చేస్తున్నట్టు గమనిస్తున్నాము. ఎందుకంటే రుణం చెల్లించనంతమాత్రాన ప్రతి కేసూ చీటింగ్ పరిధిలోకి రాదు. మీ కేసులో మీరు అసలు బ్యాంకు వారిని సంప్రదించలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం కింద ప్రభుత్వం వారే మిమ్మల్ని ఎంచుకొని రుణం ఇప్పించారు. మీరు ఆ వ్యాపారాన్ని కూడా మీ శక్తిమేరకు నడిపారు. వ్యాపారం మూతపడటంలో కూడా మీపాత్ర లేదు. కోవిడ్ లో కొన్ని వేల వ్యాపారాలు మూతపడ్డాయి. కాబట్టి చీటింగ్ కేసు మీ మీద రుజువు కావడం దాదాపు సాధ్యపడదు. చీటింగ్ కేసులో సాధారణంగా అరెస్టు చేయరు. స్టేషన్ బెయిలు ఇస్తారు. పోలీసువారికి అన్ని విషయాలను ఆధారంతో సహా సమర్పిస్తే, వారు ఫైనల్ రిపోర్టు వేసి మరీ క్లోజ్ చేసిన కేసులు నా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మీ వద్ద ఉన్న అన్ని రుజువులు పోలీసువారికి అందజేయండి. ఒకవేళ కోర్టు దాకా వెళ్లినా, ‘మొదటినుంచి వీరు మోసపూరిత భావన కలిగి ఉన్నారు’ అని (బ్యాంకు ) ప్రాసిక్యూషన్ ద్వారా ఋజువు చేయవలసి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, అలా ఋజువు చేయటం బ్యాంకువారికి కష్టమే కావచ్చు. మీ లోను విషయంలో మీరు బ్యాంకు వారిని సంప్రదించి సెటిల్మెంట్ కూడా కోరవచ్చు. మిగిలిన మొత్తంలో కొంత మాఫీ చేసి, సెటిల్ చేసేందుకు బ్యాంకువారు కూడా ముందుకు వస్తారు. కుదరని పక్షంలో కేసులను ఎదుర్కొనేందుకు దగ్గర్లోని లాయర్ను సంప్రదించండి.
– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com
చేయవచ్చు.