
రక్షణ
బాధితుల పక్షాన నిలబడడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదురుకావచ్చు. కొన్నిసార్లు బాధితులు వెనక్కి తగ్గవచ్చు. వారికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడానికి వృత్తిపరమైన అంకితభావం కావాలి. అలాంటి అంకితభావం మూర్తీభవించిన ఒక అధికారి స్రవంతి. లైంగిక వేధింపులు, అత్యాచార కేసులలో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఆఫీసర్లా కాకుండా కుటుంబ సభ్యురాలిగా బాధితుల తరఫున నిలుస్తున్నారు.
ఆడపిల్లలపై జరిగిన వేధింపుల విషయంలో బయటకు చెబితే పరువు పోతుందని చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే చాలు ఆమె అక్కడకి చేరుకుంటారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి.
మెరుపు వేగంతో బాధితుల దగ్గరికి....
ఐదేళ్ల కాలంలో కామారెడ్డి జిల్లాలో 114 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. జిల్లాలో ఏప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా, వేధింపులు ఎదురైనా ముందుగా జిల్లా అధికారులకు విషయం తెలియజేసి అక్కడికి చేరుకుంటారు స్రవంతి. ఇటీవల నవోదయ విద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది అరాచకాలతో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు సమాచారం వచ్చింది. వెంటనే విచారణ జరపమని స్రవంతిని పంపించారు. అక్కడికి వెళ్లిన స్రవంతి విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు. పదకొండు మంది అమ్మాయిలతో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. దీంతో నలుగురిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.
ఎన్నో కేసులు...
→ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇరవై ఏళ్ల యువకుడు మ్యూజిక్ నేర్పిస్తానంటూ తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీవో స్రవంతి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి పూర్తి వివరాలతో పోలీసు కేసు నమోదు చేయించారు. పాపకి వైద్యపరీక్షలు చేయించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచారు. దీంతో ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది.
→ ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడు. విషయం తెలిసిన స్రవంతి ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పది మందిపైనా పోక్సో కేసు నమోదు చేయించారు.
→ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలియడంతో విచారణకు వెళ్లిన సందర్భంగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తే గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. డాక్టర్తో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. కడుపులో పెరుగుతున్న పాప చనిపోగా డెలివరీ చేశారు. ఆ తరువాత అమ్మాయిని బాలసదనంలో చేర్పించి ఎంపీహెచ్డబ్లు్య కోర్సు పూర్తి చేయించారు. అయితే సొంత అన్నే పలుసార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తేల్చారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది.
→ బాల్య వివాహాల విషయంలోనూ స్రవంతి సీరియస్గా పనిచేస్తున్నారు. బాల్యవివాహం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి జరిగితే తలెత్తే సమస్యలను వివరించి బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు.
బాధితులు బయటికి చెప్పుకోలేకపోతున్నారు
చైల్డ్ప్రొటెక్షన్ ఆఫీసర్గా నేను చేయాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇంటా, బయటా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. కన్నతండ్రి, తోడబుట్టిన అన్న, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయ్... ఇలా రక్తసంబంధీకులే కాటేయాలని చూస్తున్న సంఘటనలతో సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. చాలా సందర్భాల్లో తమ సమస్యల గురించి బాధితులకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు. కానీ అలాగే వదిలేస్తే వేధింపులు, అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. ప్రతిచోటా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నాం.
– స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి
– ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి