District Child Protection officers
-
న్యాయం కోసం..
బాధితుల పక్షాన నిలబడడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదురుకావచ్చు. కొన్నిసార్లు బాధితులు వెనక్కి తగ్గవచ్చు. వారికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడానికి వృత్తిపరమైన అంకితభావం కావాలి. అలాంటి అంకితభావం మూర్తీభవించిన ఒక అధికారి స్రవంతి. లైంగిక వేధింపులు, అత్యాచార కేసులలో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఆఫీసర్లా కాకుండా కుటుంబ సభ్యురాలిగా బాధితుల తరఫున నిలుస్తున్నారు.ఆడపిల్లలపై జరిగిన వేధింపుల విషయంలో బయటకు చెబితే పరువు పోతుందని చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే చాలు ఆమె అక్కడకి చేరుకుంటారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి.మెరుపు వేగంతో బాధితుల దగ్గరికి....ఐదేళ్ల కాలంలో కామారెడ్డి జిల్లాలో 114 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. జిల్లాలో ఏప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా, వేధింపులు ఎదురైనా ముందుగా జిల్లా అధికారులకు విషయం తెలియజేసి అక్కడికి చేరుకుంటారు స్రవంతి. ఇటీవల నవోదయ విద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది అరాచకాలతో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు సమాచారం వచ్చింది. వెంటనే విచారణ జరపమని స్రవంతిని పంపించారు. అక్కడికి వెళ్లిన స్రవంతి విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు. పదకొండు మంది అమ్మాయిలతో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. దీంతో నలుగురిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.ఎన్నో కేసులు...→ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇరవై ఏళ్ల యువకుడు మ్యూజిక్ నేర్పిస్తానంటూ తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీవో స్రవంతి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి పూర్తి వివరాలతో పోలీసు కేసు నమోదు చేయించారు. పాపకి వైద్యపరీక్షలు చేయించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచారు. దీంతో ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది. → ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడు. విషయం తెలిసిన స్రవంతి ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పది మందిపైనా పోక్సో కేసు నమోదు చేయించారు.→ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలియడంతో విచారణకు వెళ్లిన సందర్భంగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తే గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. డాక్టర్తో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. కడుపులో పెరుగుతున్న పాప చనిపోగా డెలివరీ చేశారు. ఆ తరువాత అమ్మాయిని బాలసదనంలో చేర్పించి ఎంపీహెచ్డబ్లు్య కోర్సు పూర్తి చేయించారు. అయితే సొంత అన్నే పలుసార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తేల్చారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది.→ బాల్య వివాహాల విషయంలోనూ స్రవంతి సీరియస్గా పనిచేస్తున్నారు. బాల్యవివాహం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి జరిగితే తలెత్తే సమస్యలను వివరించి బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు.బాధితులు బయటికి చెప్పుకోలేకపోతున్నారుచైల్డ్ప్రొటెక్షన్ ఆఫీసర్గా నేను చేయాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇంటా, బయటా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. కన్నతండ్రి, తోడబుట్టిన అన్న, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయ్... ఇలా రక్తసంబంధీకులే కాటేయాలని చూస్తున్న సంఘటనలతో సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. చాలా సందర్భాల్లో తమ సమస్యల గురించి బాధితులకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు. కానీ అలాగే వదిలేస్తే వేధింపులు, అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. ప్రతిచోటా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. – స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
చోరి చేశాడనే అనుమానంతో బాలుడిపై...
సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : పాచి పని చేసుకొని జీవించే తల్లి వెంట వెళ్లడమే ఆ బాలుడి చేసిన నేరమైంది. ఇంట్లో నగదు, సెల్ఫోన్ చోరీ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే తెల్లవారు జామున ఇంటికి వచ్చి తీసుకువెళ్లి ఊచ కాల్చి వాతలు పెట్టిన అమానుష సంఘటన రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం, లక్ష్మి వారపు పేటకు చెందిన మేడబోయిన సీత, అదే ప్రాంతానికి చెందిన రాణి అనే మహిళ ఇంట్లో పాచిపని చేసుకుని జీవిస్తోంది. సీత కుమారుడైన బాలుడు అప్పుడప్పుడూ తల్లితో కూడా రాణి ఇంటికి వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో గురువారం రాణి ఇంట్లో రూ.ఐదు వేల నగదు, ఒక సెల్ ఫోన్ పోవడంతో సీత కుమారుడే తీశాడనే అనుమానంతో శుక్రవారం తెల్లవారు జామున సీత ఇంటికి వచ్చి ఆమె కుమారుడిని తీసుకువెళ్లి నగదు, సెల్ ఫోన్ ఏం చేశావంటూ రాణి, ఆమె అన్నయ్య, తల్లి, పక్కన ఉండే మరో వ్యక్తి కర్రలతో కొట్టారు. అంతటితో ఆగకుండా ఊచ కాల్చి వాతలు పెట్టారు. తనకు ఏమీ తెలియదని చెప్పినా ఆ బాలుడుని విడిచిపెట్టకుండా అమానుషంగా ప్రవర్తించారని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్లైన్ జిల్లా కో ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకొని జువైనల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చోరీ జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా చట్టాన్ని చేతులోకి తీసుకుని బాలుడిని హింసించడం తగదని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా.. అమ్మకే..
‘అమ్మా.. అమ్మకే అంటూ శిశువు రోదిస్తోంది. నీవూ ఆడదానివే కదా.. నేను ఆడపిల్లగా పుట్టిన పాపానికి అమ్మేస్తావా?.. ’ అంటూ శిశువు మూగమనసుతో తల్లిని ప్రశ్నిస్తోంది. ⇒ ఆడ శిశువులపై కొనసాగుతున్న వివక్ష ⇒ ఆరు నెలల్లో జిల్లాలో 13 మంది శిశువుల విక్రయం ⇒ పల్లెలు, తండాల్లో అవగాహన లేకనే.. ⇒ ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యతా కారణమే మెదక్ రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడుతూ మహిళలు ముందుకు పరుగులు తీస్తుంటే.. పలు గ్రామాలు, పట్టణాల్లో ఆడవారిపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. రెండో లేదా మూడో కాన్పులో ఆడబిడ్డ పుట్టిందంటే చాలు అంగడి సరుకులా జమకట్టి విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఆరునెలల్లో 13 మంది ఆడ శిశు విక్రయాలు జరిగినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా లెక్కకు రానివి మరె న్ని ఉంటాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాచైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రస్తుత ఫిబ్రవరి వరకు జిల్లాలో 13 మంది ఆడ శిశువులు తిరస్కరణకు గురయ్యారు. అందులో కొంద రు ఆడశిశులను చెత్తబుట్టల్లో, ముళ్లపొదల్లో పడేయగా మరికొందరిని తాము సాదలేమంటూ ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. బాలికల సంరక్షణ కోసం ఎన్నిచట్టాలు వచ్చిన అవేవీ ఆడశిశువులకు అండగా నిలవటంలేదు. అమ్మాయి పుట్టిందంటే తల్లిదండ్రులు వదిలించుకోవాలనే చూస్తున్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో ఈ దుస్థితి అధికంగా కన్పిస్తోంది. ఒక్క మెదక్ మండలంలోనే గత మూడేళ్లుగా ముగ్గురు ఆడశిశువులను ఒక్క మగశిశువును విక్రయించారు. 2013 నబంబర్ 25న వాడి పంచాయతీ పరిధిలోని మెట్టుతండాకు చెందిన లంబాడి రవి, అనిత దంపతులు మూడో సంతానంలోనూ ఆడబిడ్డే పుట్టిందని విక్రయించారు. 2014 మార్చి 5న రాజిపేట పంచాయతీ కప్రాయిపల్లి తండాకు చెందిన లంబాడి పీర్య, విజ్జిలకు రెండో సంతానంలో ఆడబిడ్డ పుట్టిందని బహిరంగంగా విక్రయించేందుకు సిద్ధపడ్డారు. అదే ఏడాది ఔరంగాబాద్ గిరిజన తండాకు చెందిన లండాడి దశరథం, శాంతి దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా మూడో సంతానంలోనూ మగబిడ్డ పుట్టిందని విక్రయించారు. ఈ మూడు సంఘటనలు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లగా చిన్నారులను స్వాధీనం చేసుకొని సంగారెడ్డిలోని శిశువిహార్కు తరలించారు. తాజాగా ఈనెల 23న కొత్తపల్లి గ్రామానికి చెందిన గార్ల కిష్టయ్య, నర్సవ్వ దంపతులకు మూడో సంతానంలోనే ఆడబిడ్డే పుట్టిందని విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ చిన్నారిని ఆసుపత్రి లో చూపించగా అనారోగ్యంతో ఉందని చెప్పడంతో అతను ఆ చిన్నారిని ఆ తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయం పత్రికల్లో రావడం తో ఐసీడీఎస్ అధికారులతోపాటు శిశుసంరక్షణ జిల్లా అధికారులు కొత్తపల్లికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. సదరు తల్లిదండ్రులతోపాటు కొనుగోలు చేసిన, విక్రయించిన, మధ్యవర్తిగా వ్యవహరించిన ఆశ వర్కర్పై అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా ఆడ శిశువుల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత వల్లే అవగాహన లేక ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నట్టు సమాచారం. విషయమై ప్రభుత్వం పల్లెలు, తండాల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది.