ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శారీరక లోపం పైకే కనిపిస్తుంది కాబట్టి ఈజీగా చులకనగా చూసేస్తాం. ఎక్కడో కొందరే మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. కానీ అలాంటి వాళ్లు పక్కనే ఉంటే జీవితంలో ప్రతిదాన్ని ఇట్టే జయించగలరు. ముఖ్యంగా తమలోని లోపాన్ని ఆనందంగా స్వీకరించి ధైర్యంగా నిలబడగలుగుతారు, స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకు నిదర్శనం ఈ నవవధువే. ఆమె కథ వింటే అందం గొప్పతనం ఏంటో తెలుస్తుంది.
ఆ అమ్మాయే మహిమా ఘాయ్. ముంబైకి చెందిన మహిమ తన పెళ్లి రోజున జుట్టు లేకుండా వేడుకలోకి అడుగుపెట్టి..అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా అక్కడ ఎవ్వరు నవవధువు బట్టతలను చూడలేదు. ఆమె స్థైర్యం, ఆత్మవిశ్వాసం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. సహజత్వం గొప్పతనాన్ని చాటుతున్నట్లుగా అనిపించింది.
అందం ప్రమాణాలకు అతీతమైనదని నిరూపించిన గొప్ప దృశ్యం అది. హుందాతనం, ఆత్మవిశ్వాసానికి మించిన సౌందర్యం ఇంకొకటి లేదని ఆ ఘటన నిరూపించింది. పెళ్లికూతురు అంటే ఇలానే ఉండాలనే అభిప్రాయాల్ని బేఖాతురు చేస్తూ వచ్చిన విధం అందర్నీ కట్టిపడేసింది. మహిమ అంత ధైర్యంగా అంత ముఖ్యమైన ఘట్టంలో అలా ఎలా కనిపించిందంటే..మహిమ కథేంటో తెలుసుకోవాల్సిందే..!.
అంగీకరించక తప్పని పరిస్థితి..
మహిమ చిన్నతనంలో అలోపేసియా బారిన పడింది. దాంతో జుట్టు ఊడిపోతుండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ తలపై జుట్టపెరగక మచ్చలు ఎక్కువవుతుండేవి. మళ్లీ జుట్టురావాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఇంటి చికిత్సలు, వైద్య చికిత్సలు ఎన్నో చేయించుకుంది. ఏవి ఫలితం ఇవ్వలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఆమె కుటుంబం. చివరికి వైద్యులు ఆమె వ్యాధిని నిర్థారించారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.
నవ్వు మాయమైన క్షణం..
పెద్దయ్యే కొద్ది ఆత్మనూన్యత భావంతో తీవ్ర క్షోభని అనుభవించింది. తనలో తాను కుంగిపోవడం, తరచుగా ఎవరు పట్టించుకోవడం లేదనే భావన వంటి అభద్రతాభావం ఎక్కువైపు తుండేవి. తన పరిస్థితిని దాచేందుకు, అందరి దృష్టిని మరల్చడానికి విగ్గులు ధరిస్తుండేది. ఇది కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వకపోగా ఆభద్రతా భావాన్ని మరింత ఎక్కువయ్యేలా చేసేవి. ఒక రోజు కాలేజ్లో చేసిన చిలిపి పని అందరి ముందు ఆమె నిజరూపం భయటపడంతో అలా గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. సరిగ్గా ఆ కష్టసమయంలో తాను చేసే కళాకృతులే మహిమకు కొండంత బలాన్ని ఇచ్చేవి. మహిమ స్వతహగా విజువల్ ఆర్టిస్ట్. బొమ్మలేయడంలో దిట్ట.
అతడి రాకతో వచ్చిన మార్పు..
ఆ క్రమంలో ఆన్లైన్ ఆర్డర్లపై ప్రాజెక్టులు తీసుకోవడంతో..శశాంక్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వృత్తిపరమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని ఆలోచనాత్మక ప్రవర్తన, నిజాయితీ ఆమెను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. అతడితో ఉంటే మహిమకు అభ్రతభావం మొత్తం తొలిగిపోయేది. అయితే తన గురించి శశాంక్కి పూర్తిగా తెలియాలని విగ్గు తీసి చూపింది. తన నిజ స్వరూపాన్ని చూసినప్పుడు కూడా శశాంక్ ఆమెతో మెలిగిన తీరు మహిమను మరింతగా ఆకట్టుకున్నాయి. అది శారీరక లోపం కంటే మంచి మనసుని చూసే అతడి విధానం మహిమలో ఉన్న అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది.
ఆ తర్వాత ఇద్దరు 2025లో పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకున్నారు. అయితే శశాంక్ కుటుంబ తనను ఎలా చూస్తుందో అని ఆందోళన చెందింది. వాళ్లు కూడా ఆమెను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి స్వాగతించారు. ఆ నేపథ్యంలోనే మహిమ ఇక ఎప్పటికి ముసుగు వెనుక దాగుడు మూతలు వద్దు అనుకుని ఇలా జుట్టు లేకుండానే నవ వధువుగా పెళ్లిపందిరిలోకి వచ్చింది.
ఆ పెళ్లికి వచ్చిన వాళ్లు సైతం ఆమె బట్టతలను చూడలేదు, పెళ్లి కూతురు ఆత్మవిశ్వాసం, స్థైర్యం అందరి మనసులను కదిలించాయి. తన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ వధువుని అంతా గౌరవప్రదంగా చూశారు. మన లోపాన్ని(స్థితిని) మనం అంగీకరించడంతోనే గుర్తింపు మొదలవ్వుతుందని ఈ వధువు మహిమ నిరూపించింది. తనను తాను యథావిధిగా స్వీకరించడమే అందం అని అంటోంది మహిమ..!
(చదవండి: సైకిల్పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!)


