భద్ర హరి పాట శాలలో తొలకరి | Bhadhra Hari song to welcome students across Kerala for Praveshanolsavam | Sakshi
Sakshi News home page

భద్ర హరి పాట శాలలో తొలకరి

Jun 1 2025 6:09 AM | Updated on Jun 1 2025 9:32 AM

Bhadhra Hari song to welcome students across Kerala for Praveshanolsavam

న్యూస్‌మేకర్‌ భద్ర హరి

జూన్‌ 2న కేరళలో  బడులు తెరుచుకోనున్నాయి. ఒకటో క్లాసులో చేరే పిల్లల కోసం అన్ని స్కూళ్లలో ‘ప్రవేశోత్సవం’ చేయడం కేరళ విద్యాశాఖకు ఆనవాయితీ. అయితే ఈసారి ఆ ఉత్సవానికి పాట రాయించాలనుకున్నారు. ప్రకటన ఇస్తే ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న భద్ర హరి రాసింది. ఎంపికైన ఆ పాట అన్ని స్కూళ్లలో స్వాగత గీతం కానుంది.

కేరళ ప్రభుత్వం పాఠశాల విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ ఉదంతం చెబుతోంది. అక్కడ జూన్‌ 2 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఆ వేళ విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు, కొత్త విద్యార్థులను స్కూల్లో చేరేలాప్రోత్సహించేందుకు ‘ప్రవేశోత్సవం’ నిర్వహిస్తారు. ఇది ప్రతి ఏట కేరళ విద్యాశాఖ నిర్వహించే వేడుక. కాని ఈసారి స్వాగత గీతాన్ని తయారు చేసి పిల్లలకు వినిపించాలని సంకల్పించారు. గత సెప్టెంబర్‌లో పాటను ఆహ్వానిస్తూ పేపర్‌ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనను అదూర్‌లో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న భద్రహరి చూడటంతో మన కథ మొదలవుతుంది.

రెండు రోజుల్లో పాట రాసింది
భద్రహరి ఐదో క్లాస్‌ నుంచి కవిత్వం రాస్తోంది. వాళ్ల నాన్న హరీంద్రనాథ్‌ అదూర్‌లో డిప్యూటీ తాసిల్దార్‌గా పని చేస్తున్నారు. అమ్మ సుమ టీచర్‌. పదో తరగతిలో ఉండగా ‘ధనుర్మాస పౌర్ణమి’ పేరుతో కవితా సంకలనాన్ని వెలువరించిన భద్రహరి కేరళ ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే ‘కళా ఉత్సవం’లో కవిత్వం రాసి బహుమతులు పొందింది. ప్రభుత్వ ప్రకటన చూశాక బడికి వచ్చే పిల్లల కోసం పాట రాయాలనుకుంది. ‘మజా మేఘంగళ్‌’... పల్లవితో మొదలెట్టి రెండు రోజుల్లో పాట పూర్తి చేసింది. 

‘నేను పదేళ్ల క్రితం మొదటిసారి బడికి వెళ్లడం గుర్తుకొచ్చింది ఈ పాట రాసేప్పుడు. కేరళలో చినుకులు మొదలైన వేళే బడులు తెరుచుకుంటాయి. పిల్లలు రంగురంగుల రెయిన్‌ కోట్లలో బడికి వస్తారు. కొందరు గొడుగులు తెస్తారు. మొదటిసారి చేరే పిల్లలు తల్లిదండ్రుల చేయి పట్టుకుని మొదటి అడుగు వేస్తారు. అదంతా నా మొదటి చరణంలో రాశాను. రెండో చరణంలో కేరళలో జరుగుతున్న శాస్త్ర, సాంకేతిక పురోగతిని చె΄్పాను. మూడో చరణంలో వ్యవసాయంలోను, సాంస్కృతికంగాను కేరళ ఘనతను చాటాను’ అని తెలిపింది భద్రహరి.

ముఖ్యమంత్రితో కలిసి...
పాట రాశాక భద్రహరికి ఎటువంటి రెస్పాన్స్‌ రాలేదు. అయితే వారం రోజుల క్రితం ఆమెకు విద్యాశాఖ నుంచి ఫోన్‌ వచ్చింది ‘మీ పాట స్వాగత గీతంగా ఎంపికైంది’ అంటూ. ‘ఆ రోజున నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అంది భద్రహరి. 

‘నేను రాసిన పాటకు నేనే ట్యూన్‌ కట్టి మొదట మా అమ్మానాన్నలకు వినిపించాను. వారు చాలా బాగుందని అన్నారు. అయితే ప్రభుత్వ కోరిక మేరకు సంగీత దర్శకుడు అల్ఫాన్స్‌ జోసఫ్‌ ఆ పాటకు తన ట్యూన్‌ కట్టి పాడారు. పాట చాలా బాగా వచ్చి వైరల్‌ అయ్యింది. జూన్‌ రెండున ముఖ్యమంత్రి విజయన్‌ కలవూర్‌లో జరిగే ప్రవేశోత్సవంలో ఈ పాటను ఆవిష్కరిస్తారు. ఆ వేడుకకు ఆయనతో పాటు పాల్గొనమని నాకు ఆహ్వానం అందింది’ అంది భద్రహరి.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అందరూ ఎం.పి.సి, బై.పిసిల వైపే ఇంకా మొగ్గుతున్నా పదో క్లాస్‌లో టాప్‌ మార్కులతో పాసైన భద్రహరి ఇంటర్‌లో ఆర్ట్స్‌ తీసుకుంది. మలయాళ భాషలో పై చదువు చదివి లెక్చరర్‌ కావాలనుకుంటోంది. కవయిత్రిగా గుర్తింపు పొందాలనుకుంటోంది. సమాజం కవిత్వానికి విలువ ఇవ్వకపోయినా పిల్లలకు తెలుసు కవిత్వం ఎంత గొప్పదో. దానిని ఎలా గౌరవించాలో. భద్రహరి వంటి విద్యార్థులే నిజమైన సాహిత్య, సాంస్కృతిక పరిరక్షకులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement