ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం పల్స్పోలియోపై టాస్క్ఫోర్స్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు వయసు గల 2,00,073 పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 1,094 పోలియో బూత్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోజు పోలియో చుక్కలు వేయించని పిల్లలను గుర్తించి ఈనెల 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో వ్యాక్సిన్ అందించాలన్నారు. మూడు రోజలుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో నూరుశాతం లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.
స్టాప్ డయేరియా సమర్థవంతంగా నిర్వహించాలి
ఈనెల 16 నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ –2026ను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈమేరకు జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులకు క్యాంపెయిన్ లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరు దిశానిర్దేశం చేశారు. అనంతరం గోడపత్రికలను విడుదల చేశారు.


