నూజివీడు: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం నూజివీడు మండలం సుంకొల్లు గ్రామానికి చెందిన మొగదాటి సందీప్ (26) గత నెల 20వ తేదీన మామిడి కోతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడులో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పేద కుటుంబమైన సందీప్ కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులు నిమిత్తం డబ్బులు లేక ఈనెల 12న విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సందీప్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి గతేడాదే వివాహం కాగా ఇప్పుడు ఆమె ఆరు నెలల గర్భిణి. సందీప్ మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
బుట్టాయగూడెం: ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 7 గంటలకు రంపచోడవరం నుంచి బయలుదేరి 8:30కు బుట్టాయగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ అతిథి గృహానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. అనంతరం 9 గంటలకు అక్కడి నుంచి గుబ్బల మంగమ్మ గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30కు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్లి రోగులకు అందుతున్న వైద్యసేవలను, సౌకర్యాలను పరిశీలిస్తారన్నారు. అనంతరం ఉప్పలమెట్టలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సందర్శన, మధ్యాహ్నం 3.30కు బుట్టాయగూడెం మండలం వెలుతురువారిగూడెం చేరుకుని అక్కడి గిరిజనులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. సాయంత్రం 5:15కు కేఆర్పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన సంఘాల ప్రతినిధులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. రాత్రి 8:30కు ఏలూరు చేరుకుని అక్కడ బస చేస్తారని చెప్పారు.
టి.నరసాపురం: ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి చెందాడు. ఏపుగుంట గ్రామానికి చెందిన ఇంగిర్తి నాగరాజు, సుజాతల కుమారుడు వినయ్ (18) చదువు మానేసి స్థానికంగా కూలి పనులు, ట్రాక్టర్ తోలకానికి వెళుతున్నాడు. ఈ నెల 12న గ్రామానికి చెందిన సంక్రాంతి సతీష్ ట్రాక్టర్పై మట్టి తోలకానికి వెళ్లాడు. రాత్రి సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ చాపల మడుగు కళ్యాణ్ ట్రాక్టర్ నడుపుతుండగా ట్రాక్టర్ ఇంజన్పై వినయ్ కూర్చున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా ట్రాక్టర్ నడపడంతో ఇంజన్పై కూర్చున్న వినయ్ ఒక్కసారిగా కింద పడగా అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన వినయ్ను స్థానికులు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వినయ్ తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు.


