పాలకోడేరు: మండలంలోని శృంగవృక్షం గ్రామ శివారు పెర్కిపాలెం వెళ్లే రహదారి పక్కన పచ్చని చెట్లపై మంగళవారం అమానుషంగా గొడ్డలి వేటు పడింది. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సి ఉండగా, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి సుమారు 100 చెట్లను నరికివేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.
వ్యవసాయ భూమి మార్పిడి కోసమేనా?
మంగళవారం ఉదయం పొలం గట్లపై ఉన్న దాదాపు 30కి పైగా కొబ్బరి, తాటి మానులను మొదలు వరకు నరికి దొంతరలుగా వేశారు. వీటితో పాటు అనేక తాటి చెట్ల మట్టలను కూడా విచక్షణారహితంగా నరికి కుప్పలుగా పడేశారు. మొత్తంగా వందకు పైగా చెట్లను నేలకూల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో జేసీబీ కూడా ఉండటంతో, సదరు వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మార్చేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
చట్టం ఇలా
ఆంధ్రప్రదేశ్ నీటి, భూమి, చెట్ల (వాల్టా) చట్టం ప్రకారం.. కొబ్బరి, తాటి వంటి వృక్షాలను నరకాలంటే తహసీల్దార్, ఉద్యానవన శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. నిబంధనలు అతి క్రమిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన కఠిన చర్య లు ఉంటాయి. అయితే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చెట్లను కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అనుమతులు లేకుండా తాటిచెట్ల నరికివేత


