కామవరపుకోట: మండలంలోని రావికింపాడు నుంచి ద్వారకాతిరుమల వెళ్లే రోడ్డులో ఉన్న బస్ షెల్టర్ను టీడీపీ ఫ్లెక్సీలతో మూసివేయడంతో గత కొన్ని రోజుల నుంచి ప్రయాణికులు నాన ఇబ్బందులు గురవుతున్నారు. ఇటీవల గ్రామంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ ఓ కార్యక్రమం ప్రారంభోత్సవానికిగానూ స్థానిక టీడీపీ నాయకులు చిత్రపటాలతో పాటు ఎమ్మెల్యే చిత్రపటం ఉన్న ఫ్లెక్సీతో బస్ షెల్టర్ మూసివేశారు. దీంతో ప్రయాణికుల కూర్చోవడానికి నీడ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వెళ్లాలంటే చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం పలు దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నుంచి ఆటో, బస్సుల్లో ఈ రహదారి మీదుగా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివెళ్తూ ఉంటారు. ఎండాకాలం బస్సు షెల్టర్ను ఫ్లెక్సీతో మూసివేయడంతో అక్కడికి వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు, స్థానిక నాయకులు స్పందించి ఫ్లెక్సీ తొలగించాలని కోరుతున్నారు.


