ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు భద్రత, నిఘా నిమిత్తం ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు గుడారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చెక్పోస్టులోని కీలకమైన పోలీసు రికార్డులు, సిబ్బందికి సంబంధించిన వస్తువులు, ఫర్నీచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు.
ఆగిరిపల్లి : వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సింహాద్రి అప్పారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎస్ఏ పేటకు చెందిన డేరంగుల విజయలక్ష్మి(22)కి పెదవేగి కి చెందిన నాగేంద్రకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్ని నెలలుగా భార్యాభర్తల గొడవల కారణంగా విజయలక్ష్మి పుట్టింట్లో ఉంటోంది. గత వారం రోజుల నుండి భార్యాభర్తలు ఫోన్ లో గొడవ పడుతున్నారు. ఆమె మనస్థాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


