కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో సమీప జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ, ఆదివారం రోజున ప్రత్యేక దర్శనాలు, కేశఖండన, తీర్థాలు, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయాలు, వాహన పూజలు మరియు విరాళాల ద్వారా రూ.78,915 ఆదాయం వచ్చిందని తెలిపారు.
దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ఆలయ అర్చకులు పుష్పాలతో అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేశారు. సేవా టికెట్ల ద్వారా రూ.4,650, దర్శనం రూ.59,160, విరాళాలు రూ.6,756, ప్రసాదం విక్రయం రూ.3,585, కళ్యాణ కట్ట ద్వారా రూ.800, అమ్మవారి ఫొటోల ద్వారా రూ.365 కలిపి మొత్తం రూ.1,05,276 ఆలయానికి ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.
భీమవరం: వ్యాపారం నిమిత్తం డబ్బు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారంటూ కె.అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రెహమాన్ చెప్పారు. భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన అనూష వద్ద అదే ప్రాంతంలో ఉండే ఎస్.దుర్గ రూ.7 లక్షలు అప్పు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇవ్వక పోవడంతో ఆదివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ముగ్గురి బాలికల అదృశ్యం
భీమవరం పట్టణంలోని దుర్గాపురం ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు శనివారం రాత్రి నుంచి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రెహమాన్ తెలిపారు.


