బుట్టాయగూడెం: పొగాకు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరామ్ అన్నారు. జీలుగుమిల్లిలో ప్రజా సంఘాల కార్యాలయంలో సిరిబత్తుల సీతారామయ్య అధ్యక్షతన సంఘ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు సాగు చేశారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కిలో రూ.360కు పొగాకు కొనుగోలు చేశారని ప్రస్తుతం కేవలం రూ. 240 మధ్యలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పొగాకు ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రైతులకు సగటున కిలో రూ.360 పైగా ధర లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ ట్రైనింగ్ కార్పొరేషన్ పొగాకు బోర్డు తక్షణమే స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలన్నారు. ఏపీ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జులై 3, 4,5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్నట్లు చెప్పారు. 3వ తేదీన భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామని అనంతరం బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, సహాయ కార్యదర్శి కారం భాస్కర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గూడెల్లి వెంకట్రావు పాల్గొన్నారు.


