కొయ్యలగూడెం: స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట షేక్ ఇస్మాయిల్కు చెందిన ఇంటిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం నుంచి అగ్ని మాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. అప్పటికే సుమారు రూ.30 వేల నగదుతో పాటు మొత్తం గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోయారు. విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. ఇంట్లో మంటలు చేలరేగిన సమయంలో తాము గాఢనిద్రలో ఉన్నామని, ఆ సమయంలో తాము పెంచుకుంటున్న కుక్క అరిచి తమను మేల్కొలపడంతో ప్రాణాలతో బయటపడ్డామని షేక్ ఇస్మాయిల్ చెప్పాడు. ప్రభుత్వం ద్వారా బాధితులకి రావలసిన ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్ పేర్కొన్నారు.
ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సార్వాకు అనువైన వరి విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టార్ ఎన్ మల్లిఖార్జునరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంటీయూ 1318, ఎంటీయూ 1293 విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విత్తనాలు కిలో రూ.42 కాగా 25 కేజీల బస్తా రూ.1,050 ఖరీదు అని తెలిపారు. అలాగే ఎంటీయూ 1282 రిలీజ్ కల్చర్ విత్తనాలు కేజీ రూ.50 కాగా 25 కేజీల బస్తా రూ.1,250గా ఉందన్నారు. విత్తనాలు కావలసిన రైతులు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ను 99896 23823 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.


