జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ముస్లింలు, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులతో కలిసి జంగారెడ్డిగూడెం బోసు బొమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో గౌరవంగా పూజించుకునే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింలు కోరడం అభినందనీయమన్నారు. జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు మొహమ్మద్ అబ్దుల్ నబీ మాట్లాడుతూ అంతా సమైక్యతతో ఉండి ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొప్పాక శ్రీనివాసరావు, విశ్వహిందూ పరిషత్ నాయకులు తిప్పాభట్ల రామకృష్ణ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.


