ఆగిరిపల్లి: మండలంలోని శోభనాపురం వైఎస్సార్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నక్కనబోయిన సాంబశివరావుపై విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ నాయకుడిపై ఇంతవరకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పోలీసు అధికారులను ప్రశ్నించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును ఆయన మంగళవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు సాంబశివరావును దారి కాచి కూతురి ముందే తీవ్రంగా దాడి చేశారన్నారు. ఆగిరిపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు దాడి చేయించాడని సాంబశివరావు, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నా అతనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపరిచిన టీడీపీ నాయకుడు ఇంద్రపై తూతు మంత్రంగా కేసు నమోదు చేశారన్నారు. అతను దర్జాగా బయట తిరుగుతున్నాడని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఇప్పటికై నా సాంబశివరావుపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


