కాళ్ల: ఆకివీడులో 2.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈమేరకు వివరాలను సీఐ కాళీచరణ్ వెల్లడించారు. ఆకివీడులో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే సమాచారంతో ఎస్పీ నయీమ్ అస్మి, డీఎస్పి రఘువీర్ విష్ణు ఆదేశాల మేరకు పోలీసులు దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో ఆకివీడు శివారు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద మందపాడు వెళ్లే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి పంచుకుంటుండగా ఐదుగురిని పట్టుక్నుట్లు చెప్పారు. నిందితుల నుంచి 2.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిలో ముగ్గురు పాత నేరస్తులు ఉన్నారని తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతం నుంచి ఇక్కడకు తీసుకువచ్చి గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, వారిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు చెప్పారు. గంజాయి బ్యాచ్ని పట్టుకోవడంలో సహకరించిన కానిస్టేబుల్ విజయ్, శివ, శంకర్, వాసులకు సీఐ రివార్డులు అందించారు. ఎస్సై హనుమంతు నాగరాజు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.


