భీమవరం : అధికారం కోసం బీజేపీ ఆవిర్భవించలేదని దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహించే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతే పరమావధిగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ముందు దేశం, తర్వాతే మనం అనే ఉన్నతమైన భావనతో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బీజేపీ కేవలం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను ఆధారంగా చేసుకుని నడిచే పార్టీ అన్నారు. సీనియర్ నాయకులు సైతం నిరంతర అభ్యాసం, ప్రశిక్షణ అనేది పార్టీలో అత్యంత ఆవశ్యకమని, అందువల్లే సామాన్య బూత్ స్థాయి కార్యకర్త సైతం జాతీయ స్థాయి అత్యున్నత నేతగా ఎదిగే రాజకీయ స్వేచ్ఛ బీజేపీలో సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి తపన చౌదరి, రాష్ట్ర ప్రశిక్షణ సభ్యుడు కోడూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్


