ఏలూరు (ఆర్ఆర్పేట): తలనీలాల ఎగుమతులు వృద్ధి చెందడానికి, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని శాసన మండలి సభ్యులు, ప్రముఖ తలనీలాల ఎగుమతిదారు వంక రవీంద్రనాథ్ అన్నారు. శుక్రవారం కేంద్ర సంస్థ డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ప్లాస్టిక్స్ ఎగుమతి ప్రోత్సాహక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణ సామర్థ్యం– తల నీలాల ఎగుమతులు –సాంకేతిక అభివృద్ధి అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో దక్షిణ భారతదేశం నుంచి తలనీలాల ఎగుమతి దారులు పాల్గొన్నారు. తలనీలాల ఎగుమతి ద్వారా అనేక వేల మంది అనేక రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్నారని, విగ్గులు, తదితర హెయిర్ ప్రొడెక్ట్స్ తయారీలో భారతదేశ ఎగుమతిదారులు వెనుకబడి ఉన్నారని, ఈ తయారీ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడాని ప్రభుత్వ సాయం కావాలని రవీంద్రనాథ్ కోరారు. విశాఖపట్నం డిప్యూటీ డీజీఎఫ్టీ కార్యాలయం నుంచి వచ్చిన పలని ఫణి కుమార్ ఎగుమతి దారుల సమస్యలు ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తెలిపారు. హెయిర్, హెయిర్ ప్రొడెక్ట్స్ అసోసియేషన్ చైర్మన్ బెంజమిన్ చెరియన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్లెక్స్ కౌన్సిల్ రీజనల్ డైరెక్టర్ రూబిన్ హోబ్డే, మడుపల్లి మోహన్ గుప్తా, కేకే గుప్తా, సతీష్ గాంధీ, కిషోర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


