
దేన్నయినా ఒకటికి పదిసార్లు చెబితే అది నిజమై కూర్చుంటుందని, ప్రపంచం దాన్ని మాత్రమే విశ్వసిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. పాకిస్తాన్ ఉగ్ర ఎత్తుగడను తిప్పికొట్టడానికి మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’తో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దానికి ప్రతిగా భారత్పై పాక్ సైన్యం చేసిన దాడుల్ని తిప్పి కొట్టడంతోపాటు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
గత నెల 6న మొదలై 9వరకూ సాగిన ఈ ఘర్షణలు... ఇరుపక్షాలూ 11న కాల్పుల విరమణ ప్రకటించటంతో ముగిశాయి. కానీ ట్రంప్ వేరే పనిలేనట్టు ఆనాటి నుంచీ ‘కాల్పుల విరమణ’ తన ఘనతేనంటూ చెప్పుకు తిరుగు తున్నారు. అక్కడితో ఆగలేదు. సంధి కుదుర్చుకోనట్టయితే వాణిజ్య ఒప్పందం ఉండబోదని భారత్ను హెచ్చరించాకే ఇది సాధ్యమైందని చెబుతున్నారు.
మన దేశం దాన్ని ఖండించినప్పుడు ‘అవును... నిజమే. వారిద్దరూ మాట్లాడుకొని సంధి కుదుర్చుకున్నారు. ఇందులో మాపాత్ర లేద’ని నాలుక మడతేస్తుంటారు. మళ్లీ నాలుగు రోజులు గడిచేసరికల్లా పాత పాటే అందుకుంటారు. భారత్, పాకిస్తాన్లు కాల్పుల విరమణ ప్రకటించటానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఆ సంగతి వెల్లడించటమైతే వాస్తవం.
ప్రకటించటంలో రెండు దేశాలూ కొంత వ్యవధి తీసుకోవటాన్ని ఆసరా చేసుకున్న ట్రంప్ దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బుధవారం మరోసారి ఆ పనే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 35 నిమిషాలసేపు ఆయనతో ఫోన్లో సంభాషించారు. ‘కాల్పుల విరమణ ప్రతిపాదన ఏ దశలోనూ మీ నుంచి రాలేదు. అలాగే వాణిజ్య ఒప్పందం గురించి ఇంతవరకూ మీ దేశంతో చర్చించలేదు’ అని వివరణనిచ్చారు. అక్కడితో అయిందనుకుంటే... మరికొన్ని గంటలు గడిచాక మరోసారి ట్రంప్ పాత పాటే వినిపించారు.
రష్యా–ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించి ఆయన అభాసుపాలయ్యారు. అక్కడ యథావిధిగా పోరు సాగుతోంది. గాజాలో ఇప్పటికి 56,000 మంది పౌరుల్ని ఊచకోత కోసిన ఇజ్రాయెల్పై చర్యకు అడ్డుపడటమే కాదు... వారంరోజుల క్రితం దాన్ని ఉసిగొల్పి ఇరాన్పై దాడులు చేయించారు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ను బెదిరిస్తున్నారు.
పైగా ఆ దేశంపై సైనిక దాడికి పథక రచన చేస్తున్నారు. పశ్చిమాసియా ఊబిలోకి దేశాన్ని దించవద్దంటూ స్వదేశంలో, స్వపక్షంలో అనేకులు హెచ్చరిస్తున్నా ట్రంప్కు పట్టడం లేదు. ఇలాంటి వ్యక్తి భారత్, పాకిస్తాన్ల మధ్య సంధి కుదిర్చానని ఎలా చెప్పుకుంటారో అనూహ్యం. కశ్మీర్ సమస్యపై గానీ, భారత్–పాక్ల మధ్య ఉన్న ఇతరేతర సమస్యలపై గానీ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించ బోమని దశాబ్దాలుగా భారత్ చెబుతూనే ఉంది.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ వైఖరే కొనసాగుతోంది. తాజాగా మోదీ ప్రభుత్వం దీన్ని మరికాస్త సవరించింది. మూడో పక్షం జోక్యాన్ని ఒప్పుకోబోమని చెబుతూనే మున్ముందు పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పైనా, ఉగ్రవాదుల అప్పగింత పైనా మాత్రమేనని స్పష్టం చేసింది.
ట్రంప్తో సంభాషించినప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ మొదలుకొని అన్ని విషయాలూ మోదీ పూసగుచ్చినట్టు చెప్పారని, ఇక నుంచి ఉగ్రదాడిని పరోక్ష యుద్ధంగా పరిగణించదల్చుకోలే దని, దాన్ని యుద్ధంగానే చూస్తామన్నారని మన విదేశాంగ కార్యదర్శి మిస్రీ తెలియజేశారు.
జిత్తులమారితనం దౌత్యం అనిపించుకోదు. స్పష్టంగా, పారదర్శకంగా, అరమరికలు లేకుండా వ్యవహరించినప్పుడే ఎంతటి సంక్లిష్ట సమస్యయినా దారికొస్తుంది. దౌత్యం విజయవంతమవుతుంది. బెదిరింపులకు దిగటం, బెదిరించానని గొప్పలుపోవటం దౌత్యమెలా అవుతుంది? తన వ్యాపారాన్ని విస్తరించుకోవటానికీ, ప్రత్యర్థులపై పైచేయి సాధించటానికీ పూర్వాశ్రమంలో నేర్చు కున్న కళలన్నీ ట్రంప్ వైట్హౌస్లో ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది.
దీన్ని వదిలించుకోనట్టయితే నవ్వులపాలవుతానన్న ఆలోచన ఆయనకు స్ఫురిస్తున్నట్టు లేదు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం ఊత మిస్తున్న వైనం స్పష్టంగా కనబడుతున్నా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు బుధవారం విందుకు ఆహ్వానించారు. అది ఆయన ఇష్టం.
కానీ అదే రోజు మోదీ అక్కడుండాలని కోరుకోవటం, వేరే దేశాల పర్యటన రద్దుచేసుకుని వాషింగ్టన్ రమ్మనటం హుందాతనం అనిపించుకుంటుందా? పర స్పరం కత్తులు దూసుకుంటున్న వైరిపక్షాలను ఒకేసారి పిలవటం తెలివితక్కువతనం అను కోవాలా? అతి తెలివి అనుకోవాలా? ఒకపక్క కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయటం సమ్మతం కాదని మన దేశం పదే పదే చెబుతున్నా ఈ మూర్ఖత్వం దేనికి? రేపో మాపో ఇరాన్పై తాము దండెత్తితే రీఫ్యూయలింగ్ కోసం పాకిస్తాన్ అవసరపడుతుంది.
అందుకోసం ఆ దేశాన్ని దువ్వుతూ మనల్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నట్టు ఈ కపటనాటకం ఎందుకు?
జీ7 శిఖరాగ్ర సదస్సు నుంచి హడావిడిగా నిష్క్రమించనట్టయితే, అక్కడ మోదీ ప్రసంగాన్ని నేరుగా విన్నట్టయితే ట్రంప్కు విషయం కాస్తయినా అర్థమయ్యేది. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమా ణాలు పాటిస్తున్న పాశ్చాత్య దేశాలను మోదీ నిశితంగా విమర్శించారు.
సొంత కారణాలతో కొన్ని దేశాలపై ఆంక్షలు పెడుతూ, ఉగ్రవాదుల్ని ఉసిగొల్పే దేశాలను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని మోదీ చెప్పారు. అయినా ట్రంప్ ధోరణి మారలేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్తో సహా అన్ని అంతర్జాతీయ అంశాల్లోనూ స్వతంత్ర విధానం పాటించటమే మనకు శ్రేయస్కరం. ద్వంద్వ నీతిని అనుసరించేవారికి తమ స్థానం ఏమిటో చెప్పనట్టయితే మనమే నష్టపోతాం.